
పంజాబ్ రాజకీయాల్లో ముక్కుసూటి మనిషిగా పేరొందిన మాజీ క్రికెటర్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధు బీజేపి అందించిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన ఏ పార్టీలో చేరుతారన్న అంశంపై ఆ రాష్ట్ర ప్రజలతో పాటు క్రికెట్ అభిమానులు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆయన ఆమ్ అద్మీ పార్టీలోకి వెళ్తారని, ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఆయనే ఉంటారని ఆప్ వర్గాల నుంచి సంకేతాలు కూడా వచ్చాయి. అయితే ఒక కుటుంబం నుంచి ఒక్కరికే రాజకీయ అవకాశం కల్పించే ఆప్ నిబంధన ఆయనకు శరాఘాతంగా మారాంది.
ఆయనతో పాటు ఆయన సతీమణి నవజ్యోత్ కౌర్ సిద్దూ కూడా రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు. బీజేపిలో అమె పలు పదవులను అలంకరించారు. ప్రస్తుత శాసనసభలో కూడా అమె అమ్రిత్సర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దీంతో పాటు అమె బీజేపి పంజాబ్ పార్లమెంటరీ కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. అయితే ఆప్ నిబంధలు వారిద్దరిలో ఒకరికి మాత్రమే తమ పార్టీ అవకాశం కల్పిస్తుందని తేల్చి చెప్పడంతో సిద్దూ డోలాయమానంలో పడ్డారు. అయితే అందివచ్చిన మంచి తరుణాన్ని చేజార్చుకోవడం ఇష్టం లేని కాంగ్రెస్, ఆయనకు గాలం వేసేందుకు సిద్ధమైంది.
ఇందుకోసం ఏకంగా పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రంగంలోకి దిగారు. దిగడమే కాదు సిద్దూ తమ పార్టీలోకి తప్పక చేరాలని అందుకు కారణాలు కూడా ఉన్నాయని ఆయన విశ్లేషించారు. ఆ కారణాలేంటంటే, సిద్ధు డీఎన్ ఏలో కాంగ్రెస్ ఉందని ఆయన చెప్పారు. అదేంటి ఎన్నడూ కాంగ్రెస్ పార్టీలో చేరని సిద్ధులో కాంగ్రెస్ డిఎన్ఏ ఎలా వుంటుందంటూ విస్తుపోకండి. దీనికి అమరీందర్ సింగ్ చెప్పిన వివరణ పూర్తిగా చదవుదాం. అదేమిటంటే.. సిద్ధు తండ్రి కాంగ్రెస్ పార్టీలో పనిచేశారని, సిద్ధు చిన్నప్పటి నుంచి తనకు తెలుసని, అతని కోసం కాంగ్రెస్ తలుపులు ఓపెన్ గా ఉన్నాయని చెప్పారు.
కాంగ్రెస్ లో చేరే విషయాన్ని కూడా సిద్ధు పరిశీలిస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. సిద్ధు రెండు సార్లు ఎంపీగా గెలవగా, ఆయన భార్య బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. పంజాబ్ ఎన్నికల్లో తన భార్యకు టికెట్ ఇవ్వడంతో పాటు తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఇంట్లో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తామని, సిద్ధు స్థాయికి తగినట్టుగా ప్రాధాన్యం ఇస్తామని అమరీందర్ సింగ్ చెప్పారు. ఇంతకీ సిద్ధు ఏ పార్టీలో చేరుతారన్నది వేచి చూడాల్సిందే.