
ఉత్తర ప్రదేశ్ వాసులు మరో మారు తమ రాష్ట్ర పార్టీల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే అదే తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పట్ల కూడా అకర్షితులవుతున్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో అఖిలేష్ ప్రభుత్వానికి అధిక మంది యూపీ వాసులు అమోదం తెలుపుతుండగా, ఆ తరువాతి స్థానంలో మాత్రం బీఎస్పీ పార్టీని తోసిపుచ్చుతూ బీజేపి దూసుకొచ్చింది. మూడవ స్థానంలో మాయావతి నేతృత్వంలోని బీఎస్సీ పార్టీ కొనసాగుతుండగా, ప్రశాంత్ కిషోల్ లాంటి వ్యూహ నిపుణులను తెచ్చుకున్నా కాంగ్రెస్ పార్టీకి మాత్రం పుంజుకునే పరిస్థితి లేదని తెలుస్తుంది.
ఏబీపీ న్యూస్- లోక్నీతి, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు తెలిశాయి. జూలై 23 నుంచి ఆగస్ట్ ఏడో తేదీ వరకు ఈ సర్వే జరిగింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. తాము సమాజ్వాదీకే ఓటేస్తామని 30 శాతం ఓటర్లు చెప్పారు. రెండు చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి 27 శాతం మంది ఓటర్లు అనుకూలంగా ఉన్నారు. దళిత ఉద్యమాలను ఎంత రెచ్చగొట్టినా, బీఎస్పీ మాత్రం 26 శాతం ఓట్లతో మూడో స్థానానికే పరిమితం కానుంది. కాంగ్రెస్ పార్టీకి మహా అయితే 5 శాతం ఓట్లు రావడం ఎక్కువ.
అయితే.. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో మాత్రం ఈసారి హంగ్ మాత్రమే వస్తుందని అంటున్నారు. సమాజ్వాదీ పార్టీకి 141-151 స్థానాలు వస్తాయని, బీజేపీ 124-134 సీట్లు, బీఎస్పీ 103-113 సీట్లు, కాంగ్రెస్ 8-14 స్థానాలు మాత్రమే గెలుచుకుంటాయని సర్వే తేల్చిచెప్పింది. 2012 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 11 శాతం ఓట్లు మెరుగు పరుచుకుని బీజేపీ బాగా లాభపడుతుందని అంటున్నారు. కానీ 2014 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే మాత్రం 16 శాతం ఓట్లు తక్కువే వస్తున్నాయి. యాదవ, ముస్లిం వర్గాలలో సమాజ్వాదీకి 68, 62 శాతం మద్దతు లభిస్తోందట. బీజేపీకి ఎక్కువగా ఉన్నత వర్గాలతో పాటు ఓబీసీ వర్గాల్లో ఆదరణ బాగుందంటున్నారు.
తమ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ అయితే బాగుంటుందని కొరుతున్న ప్రజలతో పాటు మాయావతి అయితే బాగుంటుందనే వారి సంఖ్య కూడా సమానంగానే వుందట. వీరిద్దరూ సీఎం పగ్గాలు చేపట్టాలని 24 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారు. కాగా ములాయం సింగ్ యాదవ్ అయితే బెటరని 4 శాతం మంది అన్నారు. ఇక బీజేపీలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ వైపు 7 శాతం, ఆదిత్యానాథ్ వైపు 5 శాతం, వరుణ్ గాంధీ వైపు 3 శాతం ఓటర్లు మొగ్గుచూపారు. ప్రధాని మోదీ పనితీరు బాగుందని 68 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వ పనితీరుపై 63 శాతం సంతృప్తి వ్యక్తమైంది. ప్రధాని మోదీ ఎన్నికల హామీ 'అచ్చే దిన్' అమలు కాలేదని 52 శాతం మంది అన్నారు. యూపీ ఓటర్లకు ప్రధాన సమస్యలు అభివృద్ధి (33%), ధరల పెరుగుదల (18%). ఈ సమస్యలను పరిష్కరించే సత్తా ఉన్నవారికే ప్రజలు పట్టం కడతారేమో చూడాలి.