డబ్బని తెలిసి కంటైనర్ల చుట్టూ గుమ్మిగూడిన జనం

భారతీయ రిజర్వు బ్యాంకు అధికారులు నిర్లక్ష్య ధోరణిని వీడటం లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల కోట్ల రూపాయల కొద్దీ డబ్బును కంటైనర్ల ద్వారా రవాణా చేయిస్తూ.. తమ నిర్లక్ష్య ధోరణిని చాటుకుంటున్నారు. ఇప్పటికే దేశ అర్థిక రాజధాని ముంబైలో కోట్ల రూపాయల చోరీలు నమోదవుతున్నా.. దొంగలను  మాత్రం ఇంకా పట్టుకోనేలేదు. ఇలాంటి తరుణంలో డబ్బును పకడ్భంధీగా పంపించాల్సిన అవసరం ఏర్పడిందని గ్రహించాల్సిన అధికారులు.. తమకు కారుచౌకగా లభించే రవాణాను ఎంచుకోవడం సముచితం కాదన్న సూచనలు వినబడుతున్నాయి. 

మొన్నటికి మొన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ తనిఖీల్లో రూ.570 కోట్ల నగదును ఎన్నికల కమీషన్ అధికారులు పట్టుకున్నారు. ఈ వార్త అప్పట్లో పెద్ద సంచలనమే కాగా, తాపీగా నిద్రలేచిన బ్యాంకు అధికారులు మాత్రం ఎన్నికల అధికారులు పట్టుకున్న డబ్బు తమదేనంటూ.. దాన్ని తమ బ్యాంకు నుంచి మరో శాఖకు పంపుతున్నామని వివరణ ఇచ్చారు. అయితే ఆ డబ్బుకు ఎస్కార్టుగా కేవలం ఒక కారులో నలుగురు పోలీసులు మాత్రమే వున్నారు. అయితే అప్పటి వరకు విషయం బయటకు తెలియకపోవడంతో పెద్ద ఇబ్బంది లేకుండా పోయింది. ఈ ఘటన మరవకముందే తాజాగా మరొక సంఘటన జరిగింది. 

రూ.500 కోట్ల నగదు తీసుకెళ్తున్న రెండు కంటైనర్లలో తరలిస్తున్నారు అధికారులు. సరిగ్గా మధురై జిల్లా తిరుమంగళం వద్ద టీ తాగేందుకు డ్రైవర్లు ఆపారు. అనంతరం లారీల్ని స్టార్ట్ చేయగా ఒకటి మొరాయించింది. కంటైనర్లలో డబ్బు విషయం చుట్టుపక్కల వ్యాపించడంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. లారీలకు ఎస్కార్టుగా ఉన్న సీఐఎస్‌ఎఫ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ మణికంఠన్, పదిమంది కమాండో పోలీసులు జనాన్ని అదుపు చేసేందుకు తంటాలు పడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక డీఎస్పీ సిబ్బందితో అక్కడికి చేరుకుని భద్రత కల్పించారు.  ఈ డబ్బును ఆర్‌బీఐ మైసూరు నుంచి తిరువనంతపురానికి పంపిస్తోంది. ఇదే ఘటన మరోసారి పునారావృతం అయితే ఏం జరుగుతుందోనన్న అందోళన పోలీసులలో కనిపించింది. కోట్ల రూపాయల డబ్బుకు ప్రమాదం సంభవించిన తరువాత లబోదిబోమంటూ మొత్తుకోకుండా.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిదని సూచనలు వినిపిస్తున్నాయి.