సీఎం శివరాజ్ సింగ్ పై నెట్ జనుల విసుర్తు

ఉత్తర భారతావనిలో వరుణుడు ప్రళయకారుడిగా నృత్యం చేస్తూ.. వాగులు, వంకలు నిండి ఇళ్లను, పొలాలను కూడా చుట్టుముట్టి బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాల ధాటికి అతలాకుతలమైన మధ్యప్రదేశ్ లోని ప్రభావిత ప్రాంతాలలో ఇప్పటికే 15 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ తరుణంలో ముంపు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి తాను ఊహించింది ఒకటి కాగా, అయ్యింది మరొకటి. తన హెలికాఫ్టర్ లో ముంపు ప్రాంతాల సర్వేను చేపట్టడంతో ప్రజల కష్టాలు తెలియవని అనుకున్నాడో ఏమో.. రోడ్డు మార్గం గుండానే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకుని వారిని పరామర్శించాలని భావించాడు. 

పర్యటనలో భాగంగా పన్నా ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అధికార యంత్రాంగం, పోలీసులు, మందిమార్బలంతో ఆయన పర్యటిస్తున్నారు. సరిగ్గా గ్రామానికి వెళ్లే చోట హరికాలు లోతు నీళ్లు ప్రవహిస్తుండడంతో ఆయన వెనక్కుతగ్గారు. వరద నీళ్లలో నడిస్తే బూట్లు తడిసిపోతాయనుకున్నారో.. లేక నీళ్లలో పురుగు, పుట్ర ఉంటాయని భయపడ్డారో గానీ, నీళ్లలో నడిచేందుకు ఆయన అయిష్టత వ్యక్తం చేశారు. కానీ అక్కడివరకు వచ్చి గ్రామస్థులను కలవకుండా వెనక్కు వెళ్లేందుకు కూడా ఆయన ఇప్టపడలేదు. 

వెంటనే జిల్లా ఎస్పీ, కలెక్టర్లు ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు ఇంతకుమించిన మంచి అవకాశం రాదనుకున్నారో ఏమో.. ఏకంగా ఆయనను తమ పోలీసులు చేతుల మీద ఎత్తుకుని మరీ తీసుకెళ్లారు. వరద ప్రాంతాల పర్యటన కోసం వెళ్లిన ఆయన.. ఇలా పోలీసుల చేతుల మీదుగా వెళ్తూ కెమెరాలకు చిక్కారు. పన్నా జిల్లాలోని అమన్‌గంజ్ ప్రాంతంలో ఆయన పర్యటించినపుడు ఈ దృశ్యం కనపడింది. ఔత్సాహికులు తమ సెల్‌ఫోన్లలో తీసిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిజానికి అక్కడ వరద నీళ్లు కూడా మరీ అంత ఎక్కువేమీ లేవు. గట్టిగా మాట్లాడితే పాదాల పైకి వస్తాయంతే. 

మరోచోట బాగా మట్టిగా ఉన్న ప్రాంతంలో ఆయన కాళ్లకు ఉన్న బూట్లు తీసేసి నడుస్తుంటే, ఆయన బూట్లను మరో సహాయకుడు చేతులతో పట్టుకుని తీసుకొచ్చాడు. నీళ్లలో పాములు ఉంటే అవి ముఖ్యమంత్రిని కాటేస్తాయన్న అనుమానంతోనే జిల్లా కలెక్టర్, ఎస్పీలు రిస్కు తీసుకోకూడదని అనుకున్నారని ఒక కథనం ప్రచారంలోకి రాగా, ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ఓ సీనియర్ ఉద్యోగి.. ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు.. ఆయన కాలికి బలమైన గాయం తగిలింది. దాంతో ఆయన నడవలేకపోయారంటూ మరో కథనాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. 

వీటిలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని నెటిజన్లు మాత్రం మూడు పర్యాయాలుగా ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చర్యలను తీవ్రంగా విమర్శించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా బ్రీటీష్ పాలన మాత్రం పోలేదని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక మరి కొందరు, ఆయన ఒలంపిక్స్ 2020లో వరద రేసు పోటీలో పాల్గొనేందుకు ఇప్పటి నుంచే ప్రాక్టీస్టు మెదలు పెట్టారని ఒకరు, అయన విజయం సాధించడంతో ఆయన కోచ్ ఆయనను అలా తీసుకెళ్తున్నారని కొందరు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. మరి దీనిపై ముఖ్యమంత్రి వర్యులు నోరు తెరిచేదెన్నడో.. కారణాలను వెల్లడించేదెన్నడో.. నంటూ ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు.