
ప్రజాదరణలో గాంధీల కుటుంబాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెనక్కి నెట్టేశారు. అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మోదీనే నిలిచారు. 19 రాష్ట్రాల్లోని 97 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ‘ఇండియా టుడే’ ఒక సర్వే నిర్వహించింది. ఓటర్లలో అత్యంత ప్రజాదరణ పొందిన నేత ఎవరనే విషయమై ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట కార్వీ ఇన్ సైట్స్ భాగస్వామ్యంతో ఈ సర్వే నిర్వహించారు. ఇప్పటికిప్పుడు సాధారణ ఎన్నికలు నిర్వహిస్తే కనుక ఎన్ డీ ఏ కే ప్రజలు మళ్లీ పట్టం కడతారని ఆ సర్వేలో తేలింది.
మోదీకి అనుకూలంగా 50 శాతం మంది ప్రజలు తమ మద్దతు తెలిపారు. మోదీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కి 13 శాతం తక్కువగా మద్దతు లభించింది. ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. ఎన్డీఏ సర్కార్ పై వస్తున్న ఆరోపణలు, వ్యతిరేకత వంటి అంశాలు ఎటువంటి ప్రభావం చూపలేకపోయానని ఈ సర్వే పేర్కొంది. ఉన్నపళంగా లోక్ సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ 304 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఎన్డీఏ కు చెందిన నాయకులే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆ సర్వే చెప్పింది.
‘బెస్ట్ పీఎం’ ఎవరనే విషయమై ఆయా రాష్ట్రాల ఓటర్లను ప్రశ్నించగా, మొదటి స్థానంలో ఇందిరాగాంధీ, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అటల్ బిహారి వాజ్ పేయి, నరేంద్ర మోదీ నిలిచారు. దేశంలోకెల్లా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముందంజలో నిలువగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ తరువాత నిలిచారు. వారి తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిలిచారు. .
కాగా మూడ్ అప్ ది నేషన్ సర్వే కోసం కార్వీ ఇన్ సైట్స్ సంస్థ మొత్తంగా 12 వేల 321 మందిని అభిప్రాయాలను సేకరించింది. 19 రాష్ట్రాల నుంచి 97 పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రజల నుంచి 194 అసెంబ్లీ నియోజకవర్గాల వారి నుంచి అభిప్రాయాలను సేకరించారు, ఆంధ్రప్రదేశ్, అస్సాం, బిహార్, చత్తీస్ ఘడ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జార్ఖంగ్ , కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్తాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి ప్రజల అభిప్రాయాలను సేకరించారు, జూలై నెలలో 15 నుంచి 27 వరకు సర్వే చేసినట్లు కార్వీ ఇన్ సైట్స్ తెలిపింది.