మరో వివాదంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ..!

వివాదాలకు నిత్యం కోత్త బాష్యం చెప్పే కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.. అదే వివాదాల కారణంగా తనకు అందివచ్చిన కేంద్రమంత్రి మానవ వనరుల శాఖను కోల్పాయినా.. తన వైఖరిని మాత్రం మార్చుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా అమె శాఖను మానవ వనరుల నుంచి చేనేత శాఖకు బదిలీ చేసినా.. తాజాగా అమె మరో వివాదానికి తెరతీశారని తెలుస్తుంది. కేవలం రెండు మాసాలలో రెండు డజన్లకు పైగా నోటీసులను జారి చేసి.. వాటికి సమాధానాన్ని కోరడమే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. 

అత్యంత సీనియర్ ఐఎఎస్ అధికారి, చేనేత శాఖ కార్యదర్శి రష్మి వర్మతో స్మృతి ఇరానీ అమీతుమీకి సిద్ధమయ్యారు. ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిద్దాం అనుకున్నప్పటికీ కార్యదర్శితో స్మృతీ విభేదించారట. జూన్ 22న కేబినెట్ ఆమోదించిన 6వేల కోట్ల రూపాయల దుస్తులు, వస్త్రాలు ప్యాకేజీ, అక్టోబర్ లో జరుగబోయే టెక్స్ టైల్ సదస్సు విషయాల్లో, విధానపరమైన పరిపాలనకు సంబంధించి కార్యదర్శితో వివాదాలు నెలకొన్నట్టు తెలుస్తోంది. వర్మతో విభేదించిన స్మృతి ఇరానీ ఇతర అధికారుల సమక్షంలోనే కార్యదర్శితో తీవ్ర వాగ్వాదానికి దిగినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవలి జరిగిన ఓ మంత్రివర్గ సమావేశంలో కూడా వస్త్రాలు, దుస్తులు ప్యాకేజీ అనుకరణపై ఇరానీ ఈ సమస్యను లేవనెత్తారని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి చెప్పారు. అనంతరం వర్మతో పాటు ఇతర అధికారులతో  పీఎంఓ  సమావేశం ఏర్పరచిందని, మూడేళ్లలో కోటి కొత్త ఉద్యోగవకాశాల కల్పనకు సంబంధించి మెగా ప్రాజెక్టు అమలు గురించి వివరించి, పరిష్కారానికి ప్రయత్నించిందని తెలుస్తోంది. అయితే స్మృతి ఇరానీతో వివాదాన్ని వర్మ ఖండించారు. నోటీసులపై స్మృతి ఇరానీ స్పందన కోరగా.. దీనిపై కామెంట్ చేయదలుచుకోలేదని,  ఇవి మామూలు కమ్యూనికేషన్స్ మాత్రమేనని దాటవేశారు. రష్మీ వర్మ 1982 బ్యాచ్ కు చెందిన బిహార్ కేడర్ అధికారి. కేబినెట్ సెక్రటరీ పీకే సిన్హా సోదరి. గత డిసెంబర్లోనే టెక్స్ టైల్ కార్యదర్శిగా ఎంపికయ్యారు