ప్రధాని మోడీ ప్రసంగం... అమాత్యులకు అలా.. ప్రజలకు ఇలా..

ఇటీవల కాంగ్రెస్ యువనేతను, బీజేపి కేంద్ర మంత్రులు, ఏ తప్పుకు టార్గెట్ చేశారో, ఇప్పుడు స్వయంగా వారే అదే తప్పు చేసి దొరికిపోయారు. పార్లమెంటులో దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలపై చర్చ జరుగుతున్న క్రమంలో రాహుల్ గాంధీ చిన్నపాటి కునుకు తీయడం.. అది కాస్తా మీడియాకు చిక్కడం.. దాంతో బీజేపి నేతలు వీర లెవల్లో ఆయన చిత్తశుద్ధిని శంఖించడం అంతా చకచకా జరిగిపోయింది. ఇది చూసిన దేశ ప్రజలకు బీజేపి నేతలు, అందునా కేంద్ర మంత్రులు, ఎంపీలు అటు లోక్ సభతో పాటు ఇటు పార్టీ కార్యక్రమాలలో కూడా చాలా ఉత్సాహంగా ఉంటారని.. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంశానికి సంబంధించి మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తారని దేశ ప్రజలు భావించారు. 

అలాంటి దేశప్రజల భావనను కేంద్రమంత్రులు అందునా సీనియర్ మంత్రులు.. కీలక శాఖల మంత్రులు రాహుల్ గాంధీ చేసిన పోరపాటునే చేశారు. ఏదో ఒకరు ఇద్దరు కాదు.. రమారమి అందరూ అదే బాటలోనే పయనించారు. 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి గంభీరంగా ప్రసంగించారు. దాదాపు 94నిమిషాలపాటు ఆయన ప్రసంగం కేంద్రమంత్రులకు లాలిపాటలా అనిపించిందో లేక జోలపాటలా అనిపించిందో తెలియదు కానీ అందరూ అడపాదడపా కునుకుపాటుకు గురయ్యారు. 

అటు ప్రజలు కూడా ప్రధాని సుధీర్ఘ ప్రసంగం బోర్ కొట్టిందో ఏమో తెలియదు కానీ.. నలభై నిమిషాల తరువాత వారు తమ సీట్లలోంచి కదులుతూ కనిపించగా, కొందరు తమ ఇళ్లకు చేరుకునేందుకు మొగ్గుచూపారు. ఇంకొందరు ఆహూతులు మాత్రం మోడీ ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించారు. కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, మనోహర్‌ పార్రికర్, అనంత కుమార్‌, ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తదితరులు ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా.. నిద్రలోకి జారుకున్నట్టు కనిపించారు. కళ్లుమూసి నిద్రమత్తులో ఉన్నట్టు కనిపించిన వారి దృశ్యాలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

స్వాతంత్ర దినోత్సవ చరిత్రలోనే అత్యంత సుధీర్ఘంగా ప్రసంగించిన ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ కొత్త రికార్డు సృష్టించారు. కేంద్ర ప్రభుత్వ విజయాలు, అభివృద్ధి, వ్యూహాలు, పాకిస్థాన్‌కు గట్టి సందేశం ఇలా పలు అంశాలపై ఈసారి ప్రధాని ప్రసంగించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే విపాసన ధ్యానాన్ని పది రోజులు ప్రత్యేకంగా సాధన చేసి వచ్చారు. ఆ ప్రభావంతో కేజ్రీవాల్ ధ్యానముద్రలో మునిగిపోగా.. ఆయనను చూసి బీజేపీ నేతలు కాస్తా ధ్యానాన్ని నేర్చుకొని ఉంటారని నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.