కేంద్రం నగదు బదిలీ లెక్కల్లో తప్పులు: కాగ్

వంటగ్యాస్ సబ్సిడీకి ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీఎల్) పథకంలో కేంద్రం తప్పుడు లెక్కలు చూపుతుందా..? అంటే అవుననే అంటోంది కాగ్ నివేదిక, నగదు బదిలీ పథకంలో కేంద్రం చూపుతున్నవన్నీ తప్పుడు లెక్కలని కాగ్ తేల్చింది. ప్రభుత్వం చెబుతున్నట్లు అంకెలు లేవని, వాస్తవానికి ప్రభుత్వం చెబుతున్న దాంట్లో కేవలం 15 శాతం మాత్రమే నిజమని గణంకాలు స్పష్టం చేస్తున్నట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) స్పష్టం చేసింది. ఈ విధానం అమలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ప్రయోజనం రూ.1,764 కోట్లేనని కాగ్ పేర్కొంది.   

డీబీటీఎల్ అమలు ద్వారా ఏకంగా రూ.23,316 కోట్ల సబ్సిడీ భారం తగ్గినట్లుగా ప్రభుత్వం చెబుతున్నదంతా అవాస్తవమేనని... వాస్తవానికి అంతర్జాతీయంగా ధరలు పడిపోయినందునే సబ్సిడీ భారం తగ్గిందని పార్లమెంటుకు అందజేసిన నివేదికలో స్పష్టం చేసింది. 2014లో ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఎల్పీజీ సబ్సిడీ భారం రూ.35,400 కోట్లుకాగా.. 2015 ఏప్రిల్-డిసెంబర్ మధ్య రూ.12,084 కోట్లు అని కాగ్ పేర్కొంది. తగ్గిన రూ.23,316 కోట్లను డీబీటీఎల్ పథకం కారణంగా జరిగిన మిగులుగా కేంద్ర ప్రభుత్వం పేర్కొనడాన్ని తప్పుబట్టింది. 

కేంద్రం ప్రకటించినట్లుగా ఈ విధానం అమలు వల్ల కేవలం రూ.1,764 కోట్లు మాత్రమే డీబీటీఎల్ కారణంగా మిగిలాయని.. మిగతా రూ.21,552 కోట్ల తగ్గుదల ముడిచమురు ధరల పతనం కారణంగా వచ్చిందేనని పేర్కొంది. ఒక సిలిండర్ కు రూ. 169.50 చొప్పున లెక్కిస్తే గణంకాలను అంచనా వేసినట్లు తెలుస్తుందని కాగ్ తెలిపింది, ఇక సబ్సీడి ద్వారా కూడా ప్రభుత్వం ప్రకటించినట్లుగా రూ.5107.48 కోట్లకు బదులుగా కేవలం 3473.48 కోట్ల రూపాయలు మాత్రమే మిగులుతున్నాయని పేర్కొంది. ఇక సబ్సీడీ కింద నగదు బదిలీ పథకం కింద రూ.35,400.46 వెచ్చిస్తున్నట్లుగా పేర్కొనడం కూడా తప్పని.. గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు కేవలం 12,084.24 కోట్ల రూపాయలను మాత్రమే వెచ్చించినట్లు కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది.