
తమిళనాడుకు గవర్నర్ కొణిజేటి రోశయ్యకు కేంద్రం ఉద్వాసన పలకనుందా..? ఆయన స్థానంలో కర్ణాటక బీజేపీ సీనియర్ నేత డీహెచ్ శంకరమూర్తికి అవకాశం ఇవ్వనుందా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. కొణిజేటి రోశయ్యకు గవర్నర్ పదవీకాలం ఈ నెల చివరికి ముగియనుండడంతో ఆయనకు మలి పర్యాయం అవకాశం కల్పించేందుకు బీజేపీ అధిష్ఠానం సుముఖంగా లేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో బీజేపి సీనియర్ నేత, కర్ణాటక శాసనమండలి చైర్మన్ శంకరమూర్తికి అవకాశం కల్పించాలని బీజేపి అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం.
రోశయ్యను మలి పర్యాయం కొనసాగించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేంద్రంలో లాబియింగ్ చేస్తుంది. అయితే అది ఫలిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఒక వేళ కేంద్రం జయలలిత ఒత్తడికి తలొగ్గిన పక్షంలో శంకరమూర్తిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నియమించేందుకు బీజేపి అధిష్టానం పావులు కదుపుతున్నట్లు సమాచారం. తెలంగాణ, ఏపీలకు ఉమ్మడి గవర్నర్ గా వున్న ఈఎస్ఎల్ నరసింహాన్ ను ఏపీకి మాత్రమే పరిమితం చేసి.. తెలంగాణకు శంకరమూర్తిని పూర్తిస్థాయి గవర్నర్ గా నియమించాలని బీజేపి అధిష్టానం పావులు కదుపుతున్నట్లు సమాచారం.
శంకరమూర్తికి బీజేపీ జాతీయ నేతలతో పాటు ఆర్ఎస్ఎస్ తో సైతం సత్సంబంధాలు కలిగుండటం, వివాదాలకు దూరంగా ఉంటారన్న మంచి పేరు కారణంగా శంకరమూర్తికి గవర్నర్ గా ప్రమోషన్ ఇవ్వాలని ఆ పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం శంకరమూర్తి కర్ణాటక శాసన మండలికి చైర్మన్ గా ఉన్నారు. ఇటీవలి మండలి ఎన్నికల అనంతరం, సభలో బీజేపీ బలం తగ్గి, కాంగ్రెస్ పుంజుకుంది. మండలి చైర్మన్ పదవి సైతం కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లిపోయేలా ఉంది. దీంతో ఆయన స్థాయికి తగినట్లుగా గవర్నర్ గా పదోన్నతి కల్పించాలని బీజేపి అధిష్టానం యోచిస్తుందని తెలుస్తుంది.
వాస్తవానికి తమిళనాడు ఎన్నికలకు ముందే రోశయ్యను తొలగిస్తారన్న వార్తలు వచ్చినప్పటికీ, ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఆ పార్టీ అధిష్ఠానం గవర్నర్ మార్పుపై దృష్టి సారించలేదు. ఇక ఎన్నికలు ముగిసిన తరువాత, తమిళనాట పుంజుకునేందుకు వ్యూహ రచన చేస్తున్న మోదీ, అందులో భాగంగా తొలి ఎత్తు వేసేందుకు సిద్ధమై, తన చేతుల్లోని గవర్నర్ మార్పు అంశాన్ని తెరపైకి తెచ్చారని తెలుస్తోంది. అయితే జయలలిత మాత్రం రోశయ్యనే గవర్నర్ గా కొనసాగించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. ఈ నెల చివరినాటికి గవర్నర్ విషయంలో స్పష్టత రానుంది.