
కేంద్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తొలుత లభించిన ఆదరణ కనిపించడం లేదా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయన అధికారంలోకి వచ్చి రాగానే అప్పటి వరకు పునాదులు గట్టిగా వున్నాయని భావించి ఏడాది కాలం పాటు ప్రచారం నిర్వహించినా.. దేశ రాజధాని ఢిల్లీలోనే ఆయన పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ప్రారంభమైన పరాభవం.. ఇంకా కొనసాగుతూనే వుంది. తాజాగా వచ్చే ఏడాది జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపి తన ఉనికిని కాపాడుకునేందుకు శక్తికి మించిన వ్యయప్రయాసలు పడాల్సి వస్తుంది. అందుకు తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన మోడీ హైదరాబాద్ నగరంలో నిర్వహించిన సభా వేదికపై నుంచి చేసిన ప్రసంగమే నిదర్శనంగా నిలుస్తుంది.
గుజరాత్ గోద్రా అల్లర్ల తరువాత ఆ ఘటనలపై మౌనం వహించిన మోడీ.. అదే పంథాను ప్రధానిగా కూడా కొనసాగిద్దామనుకుంటున్నారా..? అంటే అవుననే చెప్పక తప్పదు. ఢిల్లీ ఎన్నికలలో తన పార్టీ ఎంపీ చేసిన ప్రసంగంపై విపక్షాలు విసుర్లు దాడికి స్పందించిన ప్రధాని.. అమె గ్రామ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ అని అందుకు అమెను క్షమించాలని కోరారు. అయితే ఆ తరువాత దేశంలో జరుగుతున్న అనేక ఘటనలపై వేగంగా స్పందించన ప్రధాని.. దళితులపై జరుగుతున్న దాడులపై మాత్రం మౌనాన్ని వీడలేదు. అయితే దళితులు తమ పార్టీకి దూరంగా జరుగుతున్నారన్న వార్తల నేపథ్యంలో వారిని తన దారికి తెచ్చుకొనే ప్రయత్నమని భావించవచ్చు.
ఉత్తరాది ఘటనలపై దక్షిణాదిలో ప్రసంగించడం, దళితులను కాదు తనను కాల్చండి అంటూ పేర్కోనడం పార్టీ అవసాన దశను చేరిందన్న సంకేతాలను ఇస్తున్నాయని విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో అందుకు కారణమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విసీ అప్పారాపుపై చర్యలు తీసుకోకుండా.. భావోద్వేగానికి గురయ్యే ప్రసంగాలతో ఇంకా కాలం వెల్లబుచ్చలేరని దళిత సంఘాలు పేర్కొంటున్నాయి. ఇక మరోవైపు విపక్షాలు కూడా ప్రధాని ప్రసంగాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ అంశంలో క్రితం రోజున కాంగ్రెస్ లోక్ సభ నుంచి వాకౌట్ కూడా చేసింది.
కేంద్రంలోని దళితులపై జరుగుతున్న దాడి పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంభించిన కేంద్రం ఎన్నికలలో వారిని తమ వైపుకు తిప్పుకునేందుకు మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు ప్రమోద్ తివారి విమర్శించారు. 'దళిత సోదరులపై కాదు.. నన్ను కాల్చండి' అంటూ దళిత ఓట్లకు మోదీ గాలం వేస్తున్నారని ఆరోపించారు. జమ్మూకశ్మీర్, రాంచీలో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీ ఇదే విధమైన ఆందోళన ఎందుకు వ్యక్తం చేయడం లేదని ప్రశ్నించారు.
నకిలీ గోరక్షకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రమోద్ తివారి స్పందించారు. నిజమైన గో హంతకులు ఎక్కడనున్నారో తాను చెబుతానని అన్నారు. రాజస్తాన్ ప్రభత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో 1000 ఆవులు మరణించాయని, ఈ అంశంలో కేంద్రం ఎందుకు స్పందించదని ఆయన నిలదీశారు. ఆవుల మరణానికి కారణమైన రాజస్థాన్ ప్రభుత్వంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఇక యూపీలోని ప్రధాని వారణాసి పార్లమెంటు నియోజకవర్గం పర్యటన ముగించుకుని దళితులతో సహపంక్తి భోజనం చేసిన అమిత్ షాపై కూడా అప్పట్లో అనేక విమర్శలు వచ్చాయి. అమిత్ షా దళితులు చేసిన వంట తినలేదని, బ్రాహ్మణుడు చేసిన వంటను ఆరగించారని బీఎస్సీ అధినేత్రి మాయావతి అరోపించారు. వంటమనిషిని పట్టుకొచ్చిన వారికి బహుమతి కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే దళితులకు ప్రధాని ప్రసంగం గాలం వేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ గాలానికి దళితులు బీజేపికి దగ్గరవుతారా..? లేదా..? అన్నది వేచి చూడాల్సిందే.