
గత వారం రాజ్యసభలో సవరణలు పొందిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుకు లోక్సభ ఇవాళ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థలో భారీ పన్నుల సంస్కరణలకు తెరలేపనుంది. లోక్సభలో మొత్తం 443 మంది సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. దీంతో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. కేంద్రం ప్రతిపాదించిన జీఎస్టీ బిల్లుకు రాజ్యాంగ సవరణల అనంతరం రాజ్యసభ కూడా గత వారమే ఆమోదించింది.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతిపెద్ద పన్ను సంస్కరణగా జీఎస్టీ బిల్లును భావిస్తున్నారు. ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో రూపొందిన ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశంలోని 29 రాష్ట్రాల్లోనూ ఒకే విధంగా పన్నుశాతం ఉంటుంది. దేశమంతా ఒకే మార్కెట్గా పరిగణించబడుతుంది. ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించడంతో ఇక త్వరలోనే రాష్ట్రాలు కూడా అమోదించాల్సి వుంది. దేశంలోని 29 రాష్ట్రాలలో కనీసం 15 రాష్ట్రాల అసెంబ్లీలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి దీనిని అమల్లోకి తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం.
జీఎస్టీ బిల్లు ప్రజాస్వామ్య విజయం అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బిల్లుకు సహకరించిన అన్ని పార్టీలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. జీఎస్టీ బిల్లు ద్వారా ట్యాక్స్ టెర్రరిజం నుంచి స్వేచ్ఛ లభించిందని చెప్పారు. టీమిండియా దిశగా ముందడుగు పడిందని అన్నారు. జీఎస్టీ బిల్లు తీసుకురావడమనేది భారత్ తీసుకున్న అతిగొప్ప నిర్ణయమని, పెద్ద ముందడుగు అని మోదీ అన్నారు. ఈ బిల్లు పాస్ చేయడం ద్వారా 'వినియోగదారుడే రాజు' అనే సందేశం పంపిన వాళ్లం అవుతామని ప్రధాని తెలిపారు.