మార్చి 26 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్-15 మొదలవుతుంది. ఈసారి లక్నో సూపర్ జైంట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు కొత్తగా చేరడంతో ఐపిఎల్లో మొత్తం 10 జట్లు టాటా ఐపిఎల్-2022 కప్ కోసం పోటీ పడబోతున్నాయి. దేశంలో కరోనా ఉదృతి పూర్తిగా తగ్గినప్పటికీ, వీటిలో పాల్గొనే క్రికెటర్లు ఎక్కువ ప్రయాణాలు చేయకుండా ముంబై, పూణేలలోనే అన్ని మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ నిన్న జరిగిన సమావేశంలో నిర్ణయించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో 20 మ్యాచ్లు, ముంబైలోని బ్రబౌర్నీ స్టేడియంలో 15, ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో 20, పూణేలోని ఎంసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో 15 మ్యాచ్లు నిర్వహించబోతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
అన్ని టీములు వాంఖడే స్టేడియంలో 4 మ్యాచ్లు, బ్రబౌర్నీ, ఎంసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో 3 మ్యాచ్లు ఆడతాయి. 10 టీములు మొత్తం 70 మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్ మ్యాచ్లు, 14 లీగ్ మ్యాచ్లలో పాల్గొంటాయి. మే 29వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.