ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-15 మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్లో నిర్వహించే అవకాశం ఉంది. మ్యాచ్ షెడ్యూల్ బీసీసీఐ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఈ కొత్త జెర్సీ “పైకి ఎదగడానికి సిద్ధం” అంటూ నలుపు ఆరెంజ్ రంగుల మిశ్రమంతో రూపొందించింది. అలాగే జెర్సీ ముందు భాగాన్ని ప్లెయిన్గా ఉంచింది. వెనుకవైపు ‘సన్ రైజర్స్’ అనే అక్షరాలను పెద్దగా కనిపించేలా ప్రింటు చేశారు. పాత జెర్సీతో పోలిస్తే కొత్త జెర్సీలో స్వల్ప మార్పులు చేశారు.
పాత జెర్సీలో భుజాలపై ఆరెంజ్ రంగు ఉండగా, ఇప్పుడు జెర్సీని పూర్తిగా నలుపు రంగులోకి మార్చారు. పాత జెర్సీలో ప్యాంటు రంగు నలుపు కాగా, కొత్త జెర్సీలో ప్యాంటు రంగును ఆరెంజ్ కలర్లోకి మార్చారు. మొత్తంగా చూస్తే ఈసారి సన్ రైజర్స్ ఆటగాళ్లు ఆరెంజ్ రంగులో కనబడతారు.
గత ఐపీఎల్లో సన్ రైజర్స్ జట్టు చాలా పేలవమైన ఆటతీరును ప్రదర్శించడంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈసారి పట్టుదలతో కృషి చేసేవిధంగా జట్టు యాజమాన్యం సన్నాహాలు ప్రారంభించింది. అందుకు తగ్గ విదంగానే ఆటగాళ్లను ఎంపిక చేయనుంది. ఐపీఎల్ సీజన్-15 మెగా వేలం పాట శని, ఆదివారాలలో బెంగళూరులో జరగనుంది.