ఐపీఎల్ సీజన్-14ను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబి) ఓటమితో ముగించింది. షార్జా అంతర్జాతీయ స్టేడియంలో సోమవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబి కోల్కతా నైట్ రైడర్స్ (కెకెఆర్)తో పోటీ పడింది.
ఈ మ్యాచ్లో ఆర్సీబి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్సీబి మొదటి ఐదు ఓవర్లలో ధాటిగానే ఆడినప్పటికీ తర్వాత ఓవర్లలో చేతులెత్తేసింది. కెకెఆర్ బౌలర్ సునీల్ నరైన్ కత్తుల్లాంటి బాల్స్ తో ఆర్సీబి బ్యాట్స్ మెన్ను బెదరగొట్టేడు. దీంతో ఆర్సీబి నిర్ణీత 20 ఓవర్లలో 138 పరుగులు చేసిఏడు వికెట్లు కోల్పోయింది. సునీల్ నరైన్ నాలుగు వికెట్లు తీసుకుని ఆర్సీబిని కోలుకోలేని దెబ్బ తీశాడు. ఆర్సీబి ఇచ్చిన 139 పరుగుల లక్ష్యాన్ని కెకెఆర్ 19.4 ఓవర్లలో చేధించి ఘన విజయం సాధించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెకెఆర్ ఆరు వికెట్లను కోల్పోయింది. ఈ మ్యాచ్లో ఆల్ రౌండర్ ప్రతిభ కనపరిచిన సునీల్ నరైన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ విజయంతో కెకెఆర్ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో ఆడేందుకు అర్హత సాధించింది. షార్జా అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం రాత్రి ఏడున్నర గంటలకు జరుగబోయే రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ కెకెఆర్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఇందులో గెలిచిన టీం ఫైనల్లోకి వెళ్తుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్కు అర్హత సాధించింది.