ఐపిఎల్ సీజన్-14లో హైదరాబాద్ను పక్కనపెట్టేసాయి బీసీసీఐ, ఐపిఎల్ ఫ్రాంచైజీలు. హైదరాబాద్లో ఐపిఎల్ మ్యాచ్లు నిర్వహించాలని, అందుకు అవసరమైన సహాయసహకారాలు అందజేస్తామని మంత్రి కేటీఆర్ బీసీసీఐకి, ఐపిఎల్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు.
ముంబై కేంద్రంగా పనిచేస్తున్న బీసీసీఐపై ఆ రాష్ట్ర రాజకీయనాయకులు, క్రీడాకారుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ముంబైను ఎంపిక చేసినట్లు భావించవచ్చు. అలాగే ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్ గనుక అహ్మదాబాద్ను, శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తమిళనాడు, బెంగాలీ క్రికెట్ అభిమానులను ఆకర్షించేందుకు కోల్కతా, చెన్నైల వేదికలను ఎంపికచేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు జరుగబోయే ఐపిఎల్ సీజన్-14కు అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు వేదికలను బీసీసీఐ ఖరారు చేసింది. అయితే ఈసారి ఏ ఫ్రాంచైజీకి తమ సొంతగడ్డపై ఆడే అవకాశం లేనివిదంగా మ్యాచ్ షెడ్యూల్ రూపొందించి.
ఏప్రిల్ 9వ తేదీన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మద్య చెన్నైలో తొలి మ్యాచ్తో ఐపిఎల్ సీజన్-14 ప్రారంభం అవుతుంది. కరోనా తీవ్రత ఇంకా ఎక్కువగానే ఉన్నందున తొలిదశ మ్యాచ్లన్నీ ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు జరిగే సమయానికి కరోనా తీవ్రతను బట్టి ప్రేక్షకులను అనుమతిచాలా వద్దా? అని నిర్ణయం తీసుకొంటారు. ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొన్నట్లు బీసీసీఐ, ఐపిఎల్ ఫ్రాంచైజీలు తెలిపాయి.