మళ్ళీ పని మొదలుపెట్టిన సమంత

January 06, 2023
img

మయో సైటిస్ అనే వ్యాధికి గురై ఆయుర్వేద చికిత్స పొందుతున్న ప్రముఖ నటి సమంత మళ్ళీ పని మొదలుపెట్టారు. ఈ విషయం తెలియజేస్తూ తను నటించిన శాకుంతలం సినిమాకి డబ్బింగ్ చెపుతున్న ఓ ఫోటోని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో షేర్ చేసుకొన్నారు. దానికి ఆమె ఓ చిన్న సందేశం కూడా జోడించారు. “అన్ని బాధలు, సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగేందుకు నాకున్న ఏకైక పరిష్కారం కళ మాత్రమే. ఆ కళతోనే నేను మళ్ళీ నా ఇంటికి చేరుకొంటాను.” 

అనేక యాక్షన్ సన్నివేశాలున్న యశోద సినిమా చేస్తున్నప్పుడే సమంత ఈ కండరాల వ్యాధికి గురైయ్యారు. ఆ బాధను పంటి బిగువున భరిస్తూనే సినిమాను పూర్తి చేసి, తర్వాత తన వ్యాధి విషయం బయటపెట్టడం సినిమా పట్ల ఆమెకున్న ప్రేమ, నిబద్దతకి అద్దం పట్టింది. ఆ సినిమాకి డబ్బింగ్ చెపుతున్నప్పుడు తొలిసారిగా అభిమానులకి తన వ్యాధి గురించి తెలియజేసింది. 

అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పటికీ, సినిమా ప్రమోషన్స్‌ కోసం యాంకర్ సుమకి ఇంటర్వ్యూ ఇవ్వడం నిర్మాతకి, సినిమాకి తన వల్ల నష్టం కలగకూడదనే ఆమె తపన కనిపిస్తుంది. అదే... నయనతార పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ తాను నటించిన ఏ సినిమాలకు ప్రమోషన్స్‌లో పాల్గొనబోనని ముందే నిర్మాతలకు షరతు విధిస్తుంటారనే సంగతి అందరికీ తెలిసిందే. 

కానీ సమంత ఇప్పటికీ ఇంకా తన వ్యాధికి చికిత్స తీసుకొంటూనే శాకుంతలం సినిమాకి డబ్బింగ్ చెపుతున్నారు. సినిమా విడుదలయ్యేలోగా ఆమె పూర్తిగా కొలుకొంటే ప్రమోషన్స్‌లో కూడా పాల్గొనడం ఖాయమే.  

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ శకుంతల, దుష్యంతులుగా చేస్తున్న శాకుంతలం సినిమాని దిల్‌రాజు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ నీలిమ గుణ ఈ సినిమాను గుణా టీం వర్క్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా ఫిభ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 

Related Post