ఈసారి సంక్రాంతి పండుగకి తెలుగు సినీ పరిశ్రమలో ఇద్దరు సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణల సినిమాలు వాల్తేర్ వీరయ్య, వీర సింహారెడ్డి విడుదల కాబోతుండటంతో ఆ రెంటిలో ఏది హిట్ అవుతుంది లేదా రెండూ హిట్ అవుతాయా?అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రెండు సినిమాలు పోటాపోటీగా ప్రమోలు, ఎలివేషన్ సాంగ్స్, లిరికల్ సాంగ్స్, ఐటెమ్ సాంగ్స్, న్యూఇయర్ ఫోటోలు విడుదల చేస్తున్నాయి. ‘వేర్ ఈజ్ బాస్ పార్టీ...’ అంటూ వాల్తేర్ వీరయ్య చిందేస్తే, “మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ...” వీరసింహారెడ్డి చిందేశాడు.
ఇలా ప్రతీదీ కూడా పోటాపోటీగా ఉంటుండటంతో చిరంజీవి, బాలకృష్ణ అభిమానులు ఉర్రూతలూగిపోతున్నారు. తమ హీరో సాంగ్ అదిరిపోయిందంటే కాదు మా హీరో స్టెప్స్ అదిరిపోయాయంటూ సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్దాలే చేసుకొంటున్నారు.
బాలయ్య నటించిన వీర సింహారెడ్డి జనవరి 12న విడుదల కాబోతుండగా, చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య జనవరి 13న విడుదలవుతోంది. కనుక వాల్తేర్ వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాల మద్య గట్టిపోటీ నెలకొంది.
రెండు సినిమాలలో కూడా శ్రుతీ హాసనే హీరోయిన్గా చేసిందని అందరికీ తెలుసు. అలాగే ఈ రెండు సినిమాల నిర్మాతలు కూడా ఒక్కరే కావడం మరో విశేషం. కనుక వీటిలో ఒకటి హిట్ అయ్యి మరొకటి ఫ్లాప్ అయితే వారూ నష్టపోతారు. కనుక రెండు సినిమాలు హిట్ అవడం వారికీ చాలా అవసరమే. ఇక ఈ కొత్త సంవత్సరంలో విడుదలవుతున్న తొలి సినిమాలు ఇవే కనుక చిరంజీవి, బాలకృష్ణ, శ్రుతీ హాసన్, వాటి దర్శకులకి అందరికీ కూడా ఇవి హిట్ అవడం చాలా అవసరం.
కనుక చిరంజీవి ఓ మంచి ప్రతిపాదన చేసిన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ టాక్ షోలో పాల్గొని ఆ ఎపిసోడ్ని రెండు సినిమాలు విడుదలకి ముందే రిలీజ్ చేస్తే బాగుంటుందని చిరంజీవి ప్రతిపాదించిన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరి సినిమాలకి మరింత ప్రచారం లభిస్తుందని చిరంజీవి సూచించినట్లు తెలుస్తోంది. ఆహా ఓటీటీకి అధినేత అల్లు అరవింద్ కూడా చిరంజీవి చేసిన ఈ ప్రతిపాదనకి ఓకే చెప్పిన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తను ఇంకా వారు ధృవీకరించాల్సి ఉంది. ఒకవేళ సంక్రాంతికి ఈ ఎపిసోడ్ని విడుదల చేయాలంటే ఎక్కువ సమయం లేదు కనుక వెంటనే షూటింగ్ చేయాల్సి ఉంటుంది. కనుక నేడో రేపో దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వెలువడకపోతే బాలయ్య-చిరంజీవి షో లేన్నట్లే భావించవచ్చు. ఉంటే మాత్రం ఇది మరో అద్భుతమైన కార్యక్రమమే అవుతుంది. వారి అభిమానులనే కాక తెలుగు సినీఅభిమానులందరినీ అలరిస్తుంది.