హరి, హరీష్ దర్శకత్వంలో సమంత హీరోయిన్గా రూపొందిన యశోద సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకులు హరి, హరీష్ సమంత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. “సమంతకి ఏవైనా ఎమ్మోషనల్ సీన్స్ చేయాలంటే ఓ రెండు నిమిషాలు టైమ్ ఇమ్మనమని అడుగుతుంది. ఆ తర్వాత ఆ సన్నివేశంలో ఎంతో భావోద్వేగం పండాలో అంతగాను పండిస్తుంది. అంతవరకు మా అందరితో సరదాగా కబుర్లు చెప్పే సమంత రెండు క్షణాలలో తీవ్ర భావోద్వేగంతో ఆ పాత్రలో లీనమైపోతూ నటించడం చూసి మేము కూడా ఆశ్చర్యపోయాము.
కన్నీళ్ళ కోసం చాలా మంది హీరోయిన్లు గ్లిసరిన్ వాడుతుంటారు. కానీ సామంతకు అవేమీ అక్కరలేదు కేవలం రెండు నిమిషాలు టైమ్ ఇస్తే చాలు ఆమె ఆ పాత్రలోకి వెళ్లిపోతుంది.
ఇక ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటిని పూర్తిచేసిన తర్వాత ఆమెకు జ్వరంగా ఉందనే విషయం మాకు తెలిసి షాక్ అయ్యాము. ఈరోజుల్లో చిన్నపాటి జలుబు వస్తేనే షూటింగ్ వాయిదా వేసుకోమని అడిగే హీరోయిన్లను చూశాము కానీ ఇంత పేరున్న హీరోయిన్ సమంత జ్వరంతో కూడా చాలా కష్టమైన యాక్షన్ సీన్స్ చేయడం సినిమా పట్ల ఆమె తపనకు, నిబద్దతకు అద్దం పడుతోంది.
ఇక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజికి వచ్చే వరకు కూడా సమంతకు మయొసైటీస్ అనే వ్యాధితో బాధపడుతోందనే విషయం మాకేవరికీ తెలియనీయలేదు. అసలు ఏమీ జరగనట్లే ఆమె రోజూ చాలా చలాకీగా షూటింగ్లో పాల్గొనేవారు.
ఈ సినిమా సరోగసికి సంబందించినదే కానీ పూర్తిగా అదే కాదు. దానిలో మరో కొత్త పాయింట్ తీసుకొని యశోదగా తీశాము. ఈ సినిమా కధకు ఓ కార్పొరేట్ హాస్పిటల్ అవసరం. కనుక కొన్ని స్టార్ హోటల్స్ చూశాము కానీ వాటిలో మాకు కావలసినన్ని రోజులు షూటింగ్ చేసుకోవడం సాధ్యపడదు. అందుకే నానక్రామ్గూడాలో రెండు పెద్ద సెట్స్ వేసి వాటిని మా అవసరానికి తగ్గట్లుగా 30-40 సెట్స్గా మార్చుకొంటూ యశోద షూటింగ్ వాటిలోనే పూర్తి చేశాము.
ఈ సినిమాలో ఊహించని ట్విస్టులు, ఎప్పటికప్పుడు కధ ఎలివేట్ అవుతూ సాగుతూ ప్రేక్షకులను కట్టి పాడేస్తుందని చెప్పగలం. ఈ సినిమా ప్రేక్షకులు ఆశించిన దానికంటే చాలా ఎక్కువే అందిస్తుందని గట్టిగా నమ్ముతున్నాము,” అని చెప్పారు.