హైదరాబాద్ కేంద్రంగా తెలుగు, తమిళ సినిమాలను పైరసీ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేసి విక్రయిస్తున్న జన కిరణ్ కుమార్ అనే వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పు గోదావరికి చెందిన కిరణ్ కుమార్ వనస్థలిపురంలో నివాసం ఉంటూ ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. దాంతో పాటు కొత్త సినిమాలని పైరసీ చేస్తూ, ఒక్కో సినిమాని 400 క్రిప్టో కరెన్సీకి అమ్ముతుంటాడు.
పైరసీ కోసం నగరంలో కొన్ని సినిమా థియేటర్ల సిబ్బందితో అవగాహన ఏర్పరచుకొని అక్కడి నుంచే కొత్త సినిమాలకు కాపీలు తీసి వాటిని హెచ్డీ క్వాలిటీ ప్రింట్స్ తీసి కొన్ని వెబ్ సై ట్స్లో అప్లోడ్ చేస్తుంటాడు. ఈవిదంగా ఇప్పటి వరకు తెలుగు, తమిళ్ కలిపి మొత్తం 65 సినిమాలను పైరసీ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు కనుగొన్నారు.
సుమారు ఏడాదిన్నరగా హైదరాబాద్లో ఈ పైరసీ బిజినెస్ చేస్తున్నట్లు పోలీసులు గురించారు. జానా కిరణ్ కుమార్ వద్ద నుంచి కన్నప్ప, గేమ్ చేంజర్, పెళ్ళి కాని ప్రసాదు వంటి కొన్ని సినిమా కాపీలతో పాటు ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లు, క్రిప్టో కరెన్సీ, కొన్ని బిట్ కాయిన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అతనిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ పైరసీ వ్యవహారం అతనికి ఎవరెవరు సహకరించారో, అతను ఎవరెవరికి సినిమా అమ్మాడో కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.