అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా జనవరి 14న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా వచ్చిందమ్మా సంక్రాంతి.. అంటూ సాగే పూర్తి పాట శనివారం విడుదల చేశారు. పల్లెలో సంక్రాంతి పండుగ హడావుడి ఎంత ముచ్చటగా ఉంటుందో ఈ పాటలో చూపారు.
డా.కామేశ్వర్ దామరాజు వ్రాసిన ఈ పాటని నిహాల్ కొండూరి స్వరపరచి సంగీతం అందించగా, మాధూరి పాటిబండ బృందం ఆడి పాడారు.
ఈ సినిమాలో వెంకటేష్, మీనాక్షి చౌదరి పోలీస్ ఆఫీసర్లుగా చేస్తున్నప్పుడు ప్రేమించుకుంటారు. తర్వాత ఓ కేసు దర్యాప్తు కోసం వారు కలిసినప్పుడు వెంకటేష్ భార్య (ఐశ్వర్య రాజేష్)కి అనుమానాలు, వారి ముగ్గురు మద్య జరిగే చిలిపి గొడవలు, ముగ్గురూ కలిసి ఆ కేసు దర్యాప్తుకి బయలుదేరడం, మద్యలో సంక్రాంతి పండుగ హడావుడి వంటివన్నీ కలిపి మంచి వినోదం, యాక్షన్ సన్నివేశాలతో సినిమాని సిద్దం చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ ఫ్యామిలీ స్టోరీలో పుష్కలంగా వినోదం, కాస్త యాక్షన్ కూడా ఉంది కనుక సంక్రాంతి బరిలో గట్టిగా నిలబడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, పృధ్వీరాజ్, శ్రీనివాస్ అవసరాల, ఉపేంద్ర లిమాయే, గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, ఆనంద్ రాజ్, సాయి శ్రీనివాస్, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్ర, చిట్టి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, కొరియోగ్రఫీ: భాను మాష్టర్, ఎడిటింగ్: తమ్మిరాజు, స్టంట్స్: రియల్ సతీష్ చేశారు. శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ కలిసి ఈ సినిమాని నిర్మించారు.