హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కేరళలో ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తయింది. కానీ దానిలో ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు హైదరాబాద్, రామోజీ ఫిలిమ్ సిటీలో రెండో షెడ్యూల్ ప్రారంభం అయ్యింది.
దానిలో ప్రభాస్ కూడా పాల్గొంటున్నారు. ఈ రెండో షెడ్యూల్లో పెద్ద జైల్ సెట్ వేసి దానిలో షూటింగ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమా కూడా చేస్తున్నారు.
ఒక సినిమా షూటింగ్లో తన సన్నివేశాలు పూర్తిచేసి రెండో సినిమా షూటింగ్లో పాల్గొనే విదంగా ప్రభాస్, ఇద్దరు దర్శకులు ప్లాన్ చేసుకొని పనిచేస్తున్నారు. ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాలు చేస్తుండటంతో అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీత దర్శకత్వం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఇప్పటికే మూడు పాటలు పూర్తి చేశారు. వాటి పట్ల దర్శకుడు హను రాఘవపూడి చాలా సంతృప్తిగా ఉన్నారట.
ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా కొత్త హీరోయిన్గా ఇమాన్వీ నటించబోతోంది. అలనాటి అందాల నటి జయప్రద, బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేయబోతున్నారు.