అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో పుష్ప-2 షూటింగ్ రెండేళ్ళుగా సాగుతూనే ఉంది. ఆగస్ట్ 15వ తేదీకి సినిమా విడుదల చేస్తామని ప్రకటించి డిసెంబర్కి వాయిదా వేయడంతో అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు.
ఇప్పుడు షూటింగ్ మద్యలో అల్లు అర్జున్ విదేశాలకు వెళ్ళిపోవడంతో అభిమానులు షాక్ అయ్యారు. షూటింగ్ విషయంలో దర్శకుడు సుకుమార్తో బేధాభిప్రాయాలు రావడంతో అల్లు అర్జున్ విదేశాలకు వెళ్ళిపోయారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
దీంతో అభిమానులు పుష్ప-2 సినిమా విషయంలో ఇంకా ఆందోళన చెందుతున్నారు. ఇదేవిషయం గురించి అభిమానులు నేరుగా అల్లు అర్జున్ మేనేజర్ శరత్ చంద్ర నాయుడిని సోషల్ మీడియాలో ప్రశ్నించగా వారు ఊహించని సమాధానం ఇచ్చారు.
మాకు పుష్ప-2 షూటింగ్ గురించి సమాచారం కావాలని ఓ అభిమాని ట్వీట్ చేయగా, “దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం సినిమా ఫస్ట్-హాఫ్ ఎడిటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరైనా బ్రేక్ తీసుకోవడం కామన్,” అని శరత్ చంద్ర నాయుడు సమాధానం ఇచ్చారు.
మరో అభిమాని అదేదో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ్యాక లాంగ్ బ్రేక్ తీసుకోవచ్చు కదా?” అని ప్రశ్నించగా, ఇప్పుడు టైమ్ ఉంది. ఫస్ట్-హాఫ్ పూర్తిచేసుకొని గ్రాఫిక్స్ పని అంతా రెడీగా పెట్టుకుంటే మిగిలిన ఎడిటింగ్ పని అంతా షూటింగ్ అయిపోయాక చేసుకుంటే డిసెంబర్ 6న హ్యాపీగా వచ్చేయవచ్చు,” అని శరత్ చంద్ర నాయుడు జవాబిచ్చారు.
కనుక అల్లు అర్జున్-సుకుమార్ మద్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, మద్యలో గ్యాప్ దొరికినందునే అల్లు అర్జున్ బ్రేక్ తీసుకుని విదేశాలకు వెళ్ళారని, పుష్ప-2 పనులు యధావిధిగా జరుగుతున్నాయని, డిసెంబర్ 6కి తప్పక సినిమా రిలీజ్ అవుతుందని స్పష్టం అవడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.