అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో పుష్ప-2 సినిమా కోసం అభిమానులతో పాటు, సినీ ప్రేమికులు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆగస్ట్ 15వ తేదీన విడుదల కావలసిన పుష్ప-2 అనివార్య కారణాల వలన డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయబోతున్నట్లుమైత్రీ మూవీ మేకర్స్ బాంబులా పేల్చింది.
పుష్ప-2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ఎంత నిరాశ కలిగిస్తుందో ఊహించుకోవచ్చు. ఏదో 10 రోజులు నెల రోజులు అంటే సర్దుకు పోవచ్చు కానీ ఏకంగా నాలుగు నెలలంటే వారి సహనాన్ని పరీక్షించడమే అవుతుంది. సినిమాని చెప్పిన తేదీకి విడుదల చేయలేక వాయిదా వేసేటప్పుడు నిర్మాణ సంస్థలన్నీ చెప్పే కాకమ్మ కబుర్లే మైత్రీ మూవీ మేకర్స్ కూడా చెప్పింది. మరింత గొప్ప అనుభూతి కలిగించేందుకు సినిమా వాయిదా వేయక తప్పడం లేదని చెప్పింది.
పుష్ప-2 సినిమాకి 2022, ఆగస్ట్ 22వ తేదీన పూజా కార్యక్రమాలు జరిపారు. అంటే 2024 ఆగస్ట్ వస్తే షూటింగ్ మొదలుపెట్టి రెండేళ్ళు పూర్తవుతుందన్న మాట. ఇలా ఒక్కో సినిమా పూర్తి చేయడానికి రెండున్నరేళ్ళు సమయం తీసుకుంటుంటే అల్లు అర్జున్ వంటి ఓ అగ్రనటుడి సినీ కెరీర్ అంత విలువైన సమయం నష్టపోయిన్నట్లే కదా?
అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నైస్తున్న ఈ సినిమాలో ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపి, జగపతిబాబు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. పుష్ప-2కి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్తో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న నిర్మిస్తున్నారు.