మెగాస్టార్ చిరంజీవి, శ్రుతీ హాసన్ జంటగా నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా మరో రెండు రోజుల్లో అంటే జనవరి 13న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిరంజీవి ఈరోజు హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించారు. ఎప్పటిలాగే చెప్పిన సమయం కంటే కొన్ని నిమిషాల ముందే చిరంజీవి వచ్చేసి, మీడియా మిత్రులు ఇంకెవరైనా రావాలా? అందరూ వచ్చేస్తే మొదలుపెట్టేద్దామా?అని అడిగారు. సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్ధాలుగా ఉన్న ఇంత సీనియర్ నటుడు చిరంజీవి ఇంతగా సమయ పాలన పాటించడం, మీడియాకి ఇంత గౌరవం ఇవ్వడం ఆయన గొప్పతనాన్ని చాటుతోంది.
“వాల్తేర్ వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్కి ఏపీ ప్రభుత్వం మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినా మీరు ముఖ్యమంత్రి నుంచి ఆయన కార్యాలయ సిబ్బంది వరకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. అవసరమా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. వారికి మీ సమాధానం ఏమిటి?” అనే మీడియా ప్రశ్నకి చిరంజీవి “అవసరమే. నేను ఆగ్రహంతో ఫైర్ అయితే దాంతో నా ఇగో చల్లారుతుంది కానీ ఆ తర్వాత నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, నా అభిమానులు అందరూ ఇబ్బంది పడాల్సివస్తుంది. కనుక తగ్గితే తప్పులేదు,” అని సమాధానం ఇచ్చారు.
సినిమా టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వంతో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అడిగిన ప్రశ్నకి సమాధానం చెపుతూ, “వారు ఏ కారణంగా నిర్ణయాలు తీసుకొంటున్నారో నాకు తెలీదు. కానీ వాటి వలన ఓ 2-3 కోట్లు మాకు తేడా వస్తుంది. దాని కోసం ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవడంకంటే ఆ నష్టాన్ని వేరే రూపంలో సర్దుబాటు చేసుకోవడమే మంచిదని భావిస్తున్నాను,” అని చిరంజీవి అన్నారు.