యశోద సినిమా దర్శకులు హరి, హరీష్ ఆ సినిమాకు సీక్వెల్ కధ సిద్దంగా ఉందని, సమంత పూర్తిగా కోలుకొని నటించేందుకు సిద్దమైతే మేమూ సిద్దమే అని తెలిపారు. మళ్ళీ దాని తర్వాత యశోద-3కి కూడా తమ వద్ద కధ సిద్దంగా ఉందన్నారు. ఈ సినిమా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, “సూపర్ స్టార్ కృష్ణ చనిపోయిన రోజునే ప్రాణం పోసుకొన్న పసిపాప వంటిది మా యశోద. ఇటువంటి కాన్సెప్ట్ ఓరియంటడ్ సినిమాలు సమంతకి బాగా నప్పుతాయి. అటువంటివి ఆమె అవలీలగా చేయగలదని యశోదతో నిరూపించింది. సినీ ఇండస్ట్రీలో యశోద సినిమా చూసిన వారందరూ చాలా మెచ్చుకొంటున్నారు. కొంతమంది యశోదకి సీక్వెల్గా తీస్తారా? అని అడుగుతున్నారు. ఈ సినిమా దర్శకులు హరి-హరీష్ సీక్వెల్ చేసేందుకు కధతో సిద్దంగానే ఉన్నారు. కానీ సమంత ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆమె పూర్తిగా కోలుకొని సినిమా చేసేందుకు ఒప్పుకొంటే ఆమెతో సీక్వెల్గా తప్పకుండా తీస్తాము,” అని చెప్పారు.
యశోద సినిమాకి ప్రస్తుతం పెద్ద సినిమాల నుంచి ఎటువంటి పోటీ లేదు కనుక థియేటర్లలో నిలకడగా ఆడుతోంది. సినిమా కధ, కాన్సెప్ట్, సమంత యాక్షన్ అన్నీ బాగుండటంతో కలక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాను చాలా టైట్ బడ్జెట్తో తక్కువ ఖర్చుతో చాలా జాగ్రత్తగా తీయడం వలన సులువుగా గట్టెక్కిపోయింది. పైగా పాన్ ఇండియా మూవీగా తీయడం కూడా మంచి నిర్ణయమే అని తేలింది. ఉత్తరాది రాష్ట్రాలలో ప్రజలను ముఖ్యంగా మహిళలను యశోద బాగానే ఆకట్టుకొంటున్నట్లు తెలుస్తోంది.
కనుక మయో సైటీస్ వ్యాధితో పోరాడుతున్న సమంత త్వరలోనే కోలుకొని ప్రేక్షకులను ఖుషీ చేస్తుందని ఆశిద్దాం.