బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణగాధను ఆది పురుష్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతమ్మవారిగా కృతి సనన్ నటిస్తున్నారు. ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టరును దర్శకుడు ఓం రౌత్ ఈరోజు ఉదయం రిలీజ్ చేశారు. దానిలో శ్రీరాముడిగా ప్రభాస్ మోకాలిపై కూర్చొని చేతిలో విల్లును పట్టుకొని ఆకాశం వైపు బాణం సందిస్తున్నట్లు చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. పొడవైన జుట్టు, చేతులకు రుద్రాక్షలు, పంచెకట్టుతో శ్రీరాముడిగా ప్రభాస్ను వేషధారణ కూడా అద్భుతంగా ఉంది. అయితే మీసాలు లేని శ్రీరాముడి బొమ్మ హిందువులందరి హృదయాలలో ముద్రించుకుపోయింది. శ్రీరాముడి చిత్రా పఠాలు, విగ్రహాలు కూడా ఆవిదంగానే ఉంటాయి. కానీ ఆది పురుష్ చిత్రంలో శ్రీరాముడికి మీసాలున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టరులో చూపారు. మరి దీనిపై ప్రజలు ఏవిదంగా స్పందిస్తారో చూడాలి.
ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఆదిపురుష్ సినిమా ప్రభాస్ తొలిసారిగా చేస్తున్న పౌరాణిక సినిమాగా నిలువబోతోంది. దీనిలో కృతీ సనన్, ప్రభాస్ సీతారాములుగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ రావణుడిగా, దేవదత్త నాగే హనుమంతుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు.
రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా 2023, జనవరి 12న విడుదల కాబోతోంది. భూషణ్ కుమార్, కృషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రోఫిలీస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సచేత్-పరంపర సంగీతం, కార్తీక్ పళని కెమెరా, అపూర్వ మోతీవాలే, ఆశిష్ మాత్రే ఎడిటింగ్ చేస్తున్నారు.
ఆది పురుష్ టీజర్ను అక్టోబర్ 2వ తేదీన ఉత్తరప్రదేశ్లోని శ్రీరామజన్మభూమి అయిన అయోధ్య నగరంలో సరయూనది ఒడ్డున రిలీజ్ చేయబోతున్నట్లు దర్శకుడు ఓం రౌత్ ట్విట్టర్లో ప్రకటించారు. అదే రోజున ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు.