పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన లైగర్ సినిమా షూటింగ్ పూర్తవడంతో ప్రస్తుతం సెన్సార్ బోర్డుకి వెళ్ళినట్లు తెలుస్తోంది. సినిమాను చూసిన బోర్డు మెంబర్లు లైగర్ చాలా అద్భుతంగా ఉందని, ముఖ్యంగా విజయ్ దేవరకొండ నటన చాలా అద్భుతంగా ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 20 నిమిషాలని వారు తెలిపినట్లు సమాచారం. సెన్సార్ సర్టిఫికేట్ ఇంకా విడుదల చేయవలసి ఉంది.
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా లైగర్ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కనుక దీని హిందీ వెర్షన్ ద్వారా విజయ్ దేవరకొండ తొలిసారిగా బాలీవుడ్లో ప్రవేశిస్తుండగా, బాలీవుడ్ నటి అనన్య పాండే దీని తెలుగు వెర్షన్ ద్వారా టాలీవుడ్లో అడుగుపెట్టబోతోంది. లైగర్లో విజయ్ దేవరకొండ తల్లిగా రమ్యకృష్ణ నటించారు. ఇంకా విష్ణురెడ్డి, గెటప్ శ్రీను, మకరంద్ దేశ్ పాండే, రోనిత్ రాయ్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి నిర్మించిన లైగర్ ఆగస్ట్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.