కరోనా దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కొలుకొంటున్న తెలుగు సినీ పరిశ్రమకు ఊహించని మరో షాక్ తగిలింది. సినీ పరిశ్రమలో పనిచేస్తున్న 24 విభాగాలకు చెందిన కార్మికులు రేపటి నుంచి నిరవధిక సమ్మె చేయబోతున్నారు. ఇంటద్దెలు, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు అన్నీ పెరిగిపోయినప్పటికీ సినీ నిర్మాణ సంస్థలు, నిర్మాతలు తమకు జీతాలు మాత్రం పెంచడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనుక బుదవారం నుంచి తమ జీతాలు పెంచేవరకు సమ్మె చేయబోతున్నట్లు తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. అంతవరకు సినీ కార్మికులు ఎవరూ షూటింగులలో పాల్గొనబోరని ప్రకటించింది.
ప్రేక్షకులకు వినోదం పంచే సినీ పరిశ్రమలో లైట్ బాయ్స్, జూనియర్ ఆర్టిస్ట్ మొదలు నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు వరకు ఎవరి కష్టాలు వారికి ఉన్నాయి. పైగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం సినీ పరిశ్రమపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తుండటంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సినీ తారల ధగధగలు ముందు అవేవీ బయటకు కనబడవు. సినీ ప్రమోషన్ హడావుడిలో వారి గోడు ఎవరికీ వినబడదు.