రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఆర్ఆర్ఆర్ ఈనెల 7వ తేదీన విడుదల కావలసి ఉండగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగి థియేటర్లు మూతపడుతున్న కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడింది. అప్పటి నుంచి ప్రజలు దాని కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి ఆ శుభవార్త వచ్చింది. కరోనా తీవ్రత తగ్గి థియేటర్లన్నీ 100 శాతం ఆక్యుపెన్సీతో నడిచినట్లయితే మార్చి 18వ తేదీన లేకుంటే ఎట్టి పరిస్థితులలో ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించారు.
కరోనా తీవ్రత ఫిబ్రవరి నెలాఖరు నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టి మళ్ళీ మార్చిలో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. కనుక మార్చి 18వ తేదీన ఆర్ఆర్ఆర్ విడుదల ఖాయమని భావించవచ్చు. పరిస్థితులు చక్కబడితే ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధే శ్యామ్ కూడా ఇంచుమించు అదే సమయానికి విడుదల కావచ్చు. ఒకవేళ మార్చిలో ఈ రెండు పెద్ద సినిమాలు విడుదలైతే మహేష్ బాబు చిత్రం ‘సర్కారువారి పాట’కి, అలాగే పవన్ కళ్యాణ్, రాణా ప్రధాన పాత్రలలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న 'భీమ్లా నాయక్' చిత్రాల విడుదలకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు.