ప్రముఖ తెలుగు సినీ నిర్మాత జక్కుల నాగేశ్వర రావు (46) గురువారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. కృష్ణా జిల్లాలోని నెప్పల్లి నుంచి ఆయన గుడివాడకు కారులో వెళుతుండగా విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. దారిలో తాడంకి వద్ద రోడ్డు పక్కనే పంక్చర్ షాపు వద్ద కారును ఆపి టైర్లలో గాలి కొట్టిస్తున్నప్పుడు ఆయన కారు దిగి రోడ్డు పక్కన నిలబడి ఎవరితోనో మాట్లాడుతుండగా వెనక నుంచి దూసుకువచ్చిన ఓ లారీ బలంగా ఢీకొట్టడంతో ఆయన ఘటనా స్థలంలోనే చనిపోయారు.
జక్కుల నాగేశ్వర రావు వీడు సరైనోడు, అమ్మానాన్న ఊరేళ్ళితే, లవ్ జర్నీ తదితర సినిమాలు నిర్మించారు. ఆయనకు భార్య ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. మూడు నాలుగురోజుల వ్యవధిలో తెలుగు సినీ పరిశ్రమలో మొదట కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్, తరువాత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఇప్పుడు జక్కుల నాగేశ్వర రావు మరణించారు.