ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడాన్ని నేటికీ చాలా మంది నమ్మలేకపోతున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా వారిలో ఒకరు. నిన్న బెంగళూరు వెళ్ళి పునీత్ కుటుంబాన్ని కలిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “పునీత్తో నాకు పెద్దగా పరిచయం లేనప్పటికీ నాలుగేళ్ళ క్రితం ఓసారి బెంగళూరు వెళ్లినప్పుడు వాళ్ళింటికి వెళ్ళి ఆయనను కలిశాను. ఆయన ఎంతో నిరాడంబరంగా... ఆప్యాయంగా నాతో వ్యవహరించిన తీరు నిజంగా నన్ను ఎంతో ఆకట్టుకొంది. ఆయన 1,800 మంది పేదపిల్లలను దత్తత తీసుకొని వారి బాగోగులు చూస్తున్నారని తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయాను. కానీ ఈ విషయం ఆయన చనిపోయిన తరువాతే చాలా మందికి తెలిసింది. ఈరోజుల్లో చిన్న సాయం చేసినా మీడియాలో పెద్దగా ప్రచారం చేయించుకొంటారు. కానీ పునీత్ ఇంతమందికి చిరకాలంగా సేవ చేస్తూ కూడా ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇది ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. ఇటువంటి గొప్ప వ్యక్తి చనిపోయాడంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను,” అని అన్నారు.