అలనాటి మధుర గాయకుడు ఘంటసాల రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్ గురువారం ఉదయం చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో తుది శ్వాసవిడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబందిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చేరి డయాలసిస్ చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం కరోనా పరీక్ష చేయగా నెగెటివ్ అని రావడంతో ఆయన తప్పక కొలుకొంటారని కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూశారు. కానీ ఈరోజు ఉదయం పరిస్థితి విషమించి కనుమూశారు.
ఘంటసాల రత్నకుమార్ తొలుత తండ్రికి గాన వారసుడిగా చిత్ర పరిశ్రమలో ఎదగాలని ప్రయత్నించారు. కానీ తరువాత డబ్బింగ్ ఆర్టిస్ట్గా మారి సుమారు వెయ్యికి పైగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ప్రముఖ హిందీ సినిమా నటులు సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్లకు ఘంటసాల రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు. దక్షిణాదిన అరవింద్ స్వామి, అర్జున్, కార్తీక్లకు డబ్బింగ్ చెప్పారు. ఘంటసాల రత్నకుమార్ అనేక సినిమాలకు మాటలు అందించారు.