ఏపీలో డెప్యూటీ కలక్టర్ తాతా మోహన్ రావుకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినందుకు డెప్యూటీ కలక్టర్ హోదాలో పని చేస్తున్న ఆయనని తహశీల్దార్ పదవికి దించేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2013లో ఆయన హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా గుంటూరు జిల్లాలో పేదల గుడిసెలను తొలగించారు. అందుకు ఏపీ హైకోర్టు ఆయనకు 2 నెలల జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విదించింది.
హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించగా దానిపై విచారణ జరిపిన జస్టిస్ ఏజీ మసీహ్, జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపి ఈ తీర్పు ఇచ్చింది.
పిటిషనర్ ప్రభుత్వోద్యోగి కనుక 48 గంటలకు మించి జైల్లో ఉంచితే ఉద్యోగం పోతుందని, ఆయన కుటుంబం రోడ్డున పడుతుందని కనుక జైలు శిక్షని మినహాయించాలని ఆయన తరపు న్యాయవాది అభ్యర్ధించారు.
సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, పిటిషనర్ ఈ కేసు విచారణకి హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇంత దూరం తెచ్చుకున్నారని, అదే.. సకాలంలో హాజరయ్యి ఉండి ఉంటే ఇంక్రిమెంట్స్ కోతతో సరిపెట్టి ఉండేవారిమని న్యాయమూర్తులు అన్నారు.
అయినప్పటికీ పిటిషనర్ అభ్యర్ధనపై మానవతా దృక్పదంతో స్పందిస్తూ జైలు శిక్ష నుంచి మినహాయిస్తున్నామని తెలిపారు. ఆయన కూల్చివేసిన పేదల ఇళ్ళ నిర్మాణానికి వారం రోజులలోగా రూ.4 లక్షలు కోర్టులో జమా చేసి ఆ రశీదుని సుప్రీంకోర్టుకి సమర్పించాలని న్యాయమూర్తులు ఆదేశించారు.
ఆయనని డెప్యూటీ కలక్టర్ స్థాయి నుంచి తహశీల్దార్ స్థాయికి దించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.