ప్రపంచవ్యాప్తంగా కాథలిక్స్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ (88) ఇటలీ కాలమాన ప్రకారం సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
పోప్ ఫ్రాన్సిస్ 1938 లో అర్జెంటీనాలో జన్మించారు. ఆయన ఓ మత గురువుగా మాత్రమే కాకుండా పలు అంశాలపై తన అభిప్రాయాలను నిఖచ్చిగా చెపుతుంటారు. ఆయన సామాన్య ప్రజల తరపున మాట్లాడే వ్యక్తిగా గుర్తింపు పొందారు.
తొలిసారిగా పలువురు భారతీయ కాథలిక్ మత గురువులకు సెయింట్ హుడ్ (దైవ దూత) హోదా ప్రసాదించిన వ్యక్తి ఆయనే. కేరళకు చెందిన సిస్టర్ యుఫ్రాసియా ఏళువత్తింగళ్, ఫాదర్ కురియకోస్ ఎలియాస్ చావరలకు 2014లో సెయింట్ హుడ్ హోదా ప్రసాదించారు.
మళ్ళీ 2022 లో దేవసహాయం పిళ్లైకు పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హుడ్ హోదా ప్రసాదించారు. తన జీవిత కాలంలో ఒక్కసారైనా భారత్లో పర్యటించాలని పోప్ ఫ్రాన్సిస్ అనుకున్నారు. కానీ భారత్లో అడుగుపెట్టకుండానే ఆయన తుది శ్వాస విడిచారు.
పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల ప్రధాని మోడీతో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాధినేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కాథలిక్స్ ఆయన ఆత్మ శాంతి కోసం చర్చిలలో ప్రత్యేక ప్రార్ధనలు చేసి సంతాపం తెలుపుతున్నారు.