హైదరాబాద్లో పంజగుట్ట వద్ద గల నీమ్స్ హాస్పిటల్లో శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. నిమ్స్ హాస్పిటల్ 5 వ అంతస్తులోని ఎమర్జన్సీ బ్లాకులో హటాత్తుగా మంటలు వ్యాపించాయి. వెంటనే రోగులు, వారి సహాయకులు, వైద్య సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది కొన్ని నిమిషాల వ్యవధిలోనే అక్కడకు చేరుకొని మంటలు ఆర్పివేశారు. అగ్ని ప్రమాదానికి కారణం తెలియవలసి ఉంది. బహుశః విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యుండవచ్చని భావిస్తున్నారు.
ఈ అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కానీ ఆయా వార్డులలో ఉన్న వైద్య పరికరాలు, మంచాలు, పరుపులు, ఇతర సామాగ్రి మంటల్లో కాలిపోయాయి. పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని అగ్నిప్రమాదానికి కారణం కనుగొనేందుకు దర్యాప్తు ప్రారంభించారు.