మానవ సంబంధాలను డబ్బు ఎంతగా శాశిస్తోందో తెలిపే దారుణమైన ఘటన హైదరాబాద్లో జరిగింది. షాద్ నగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్మరి కృష్ణను ఆయన సొంత కొడుకు శివ హత్య చేయించాడు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, కమ్మరి కృష్ణకు మొదటి భార్య ద్వారా ఇద్దరు కుమారులు కలిగారు. ఆమె చనిపోవడంతో మరో మహిళని వివాహం చేసుకోగా ఆమె కూడా కొన్నేళ్ళ క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. దాంతో పావని అనే మహిళని మూడో వివాహం చేసుకున్నాడు.
అప్పటికే మొదటి భార్య ద్వారా కలిగిన ఇద్దరు కుమారులు పెద్దవారై ఆయన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నారు.
ఆయన మూడో భార్య పావనికి ఏడాదిన్నర క్రితం ఓ పాప జన్మించడంతో కమ్మరి కృష్ణ ఆమె పేరిట సుమారు రూ.16 కోట్లు విలువైన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసి బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి కమ్మరి కృష్ణ మొదటి భార్య పెద్ద కుమారుడు శివ తండ్రితో గొడవపడటం మొదలైంది.
తండ్రి సంపాదించిన ఆస్తి అంతా మూడో భార్యకు ఇచ్చేస్తే తమ పరిస్థితి ఏమిటని ఆలోచన మొదలైంది. ఆ ఆలోచన నుంచే తండ్రిని హత్య చేసి మొత్తం ఆస్తి దక్కించుకోవాలనే దురాశ శివలో మొదలైంది.
తండ్రికి ఎంతో నమ్మకస్తుడైన బాబా శివానంద్ అలియాస్ బాబాతో మాట్లాడి తండ్రిని హత్య చేస్తే25 లక్షల నగదు, ఓ ఇల్లు ఇస్తామని ఆశ జూపాడు. దాంతో అతను జీలకర్ర గణేశ్ అలియాస్ లడ్డు, మరో మైనర్ బాలుడితో కలిసి కమ్మరి కృష్ణ హత్యకు ప్రణాళిక సిద్దం చేశాడు.
ఈనెల 10వ తేదీ సాయంత్రం కమ్మరి కృష్ణ కమ్మదానంలోని తన కెకె ఫామ్హౌస్లో విశ్రాంతి తీసుకుంటుండగా వారు ముగ్గురూ లోనికి జొరబడి హత్య చేసి పారిపోయారు.
పావని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా కమ్మరి శివ ఈ కుట్రకు సూత్రధారి అని కనిపెట్టి అరెస్ట్ చేశారు. అతను చెప్పిన వివరాల ఆధారంగా ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేసి హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు.