టాలీవుడ్ యువ నటుడు రాజ్ తరుణ్పై నిన్న నార్సింగి పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదవడంతో శుక్రవారం అతను మీడియా ముందుకు వచ్చి ఈ వ్యవహారం గురించి మాట్లాడారు.
“ఆమెతో నేను రిలేషన్లో ఉన్న మాట వాస్తవమే. ఆమెను పెళ్ళి చేసుకోవాలని కూడా అనుకున్నాను. అయితే గత కొంతకాలంగా ఆమె మాదక ద్రవ్యాలకు అలవాటు పడింది. అప్పుడే నేను చాలా వారించాను కానీ వినలేదు. అదే సమయంలో ఆమెకు మస్తాన్ అనే మరో వ్యక్తితో పరిచయం ఏర్పడి అతనితో సంబంధం పెట్టుకుంది. నేను ఆమెకు నచ్చజెప్పేందుకు చాలా ప్రయత్నించాను. కానీ ఆమె మారకపోగా నన్ను బెదిరించసాగింది. ఆమెతో పోరు పడలేకనే బ్రేకప్ అయ్యాను.
ఆమె మాదక ద్రవ్యాలకు అలవాటు పడిందనే విషయం నేను అప్పుడే పోలీసులకు తెలియజేసి ఉండాల్సింది. కానీ ఇది నా కుటుంబ ప్రతిష్ట, నా సినీ కెరీర్పై ప్రభావం చూపుతుందని భయపడి చెప్పలేదు. కానీ నేను బ్రేకప్ చెప్పినప్పటి నుంచి ఆమె నా స్నేహితులకు, ఇండస్ట్రీలో వారికి ఫోన్లు చేస్తూ నా గురించి చెడుగా చెపుతోంది. ఆమె వలన నేను, నా కుటుంబ సభ్యులు తలెత్తుకొని తిరుగలేకపోతున్నాము.
త్వరలో నా సినిమా (పురుషోత్తముడు) విడుదల కాబోతోంది. అందుకే లావణ్య ఇప్పుడు నాపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నిస్తోంది. మా కధ ఇంతవరకు వచ్చింది కనుక ఇక దాపరికం ఏమీ లేదు. నేను కూడా పోలీసులకు అన్నీ చెప్పేస్తాను. నేను ఆమెను అన్యాయం చేయలేదు. ఆమె నా జీవితంతో ఆడుకుంటోంది,” అని రాజ్ తరుణ్ చెప్పారు.