ఏటా భారత్ నుంచి లక్షల మంది ముస్లింలు హజ్ యాత్రకు సౌదీ అరేబియా వెళుతుంటారు. వారిలో వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు కూడా చాలా మంది ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేసి పుణ్యం సంపాదించుకోవాలనే తపనతో శరీరం, ఆరోగ్యం సహకరించకపోయినా హజ్ యాత్రకు వెళుతుంటారు.
ఈ ఏడాది మే9వ నుంచి ఇప్పటి వరకు 1.75 లక్షల మంది భారత్ నుంచి హజ్ యత్రకు వెళ్లారని, జూలై 22లోగా మరో లక్షన్నర మంది హజ్ యాత్రకు వెళ్ళే అవకాశం ఉందని భారత్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ తెలిపారు.
ఇప్పటివరకు హజ్ యాత్రకు వెళ్ళినవారిలో 98 మంది భారతీయులు వృద్ధాప్యం, అనారోగ్యంతో మృతి చెందారని తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో నలుగురు చనిపోయారని తెలిపారు. అరాఫత్ ఒక్క రోజునే ఆరుగురు భారతీయులు చనిపోయారని తెలిపారు. గత ఏడాది హజ్ యాత్రకు వెళ్ళినవారిలో 187 మంది చనిపోయారని తెలిపారు.
కనుక రాబోయే నెల రోజుల్లో హజ్ యాత్రకు బయలుదేరబోతున్నవారు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని, సౌదీ చేరిన తర్వాత ఎప్పటికప్పుడు తమ బంధుమిత్రులతో టచ్లో ఉండాలని రణదీప్ జైస్వాల్ విజ్ఞప్తి చేశారు.