ఆషాడమాసం అంటేనే బోనాల పండగ గుర్తొస్తుంది అందరికీ. జూన్ 22న గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఆషాడ బోనాల ఉత్సవాలు ప్రారంభం అవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాకు తెలియజేశారు. ఈరోజు హైదరాబాద్, బేగంపేట వద్దగల హరిత ప్లాజాలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మేయర్ విజయలక్ష్మి, డిజిపి అంజని కుమార్, ఇంకా వివిద శాఖల అధికారులు సమావేశమయ్యి ఆషాడ బోనాల నిర్వహణ, ఏర్పాట్ల గురించి చర్చించారు.
అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, “జూన్ 22న గోల్కొండ కోటలో అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో ఆషాడ బోనాలు ప్రారంభం అవుతాయి. జూలై 9న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ ఆలయంలో బొనాలు సమర్పించి, అక్కడే జూలై 10న స్వర్ణలత భవిష్యవాణి కార్యక్రమం రంగం, జూలై 16న పాతబస్తీలో, జూలై 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో బోనాలు నిర్వహిస్తాము. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. బోనాల పండుగను తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక కనుక అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము,” అని చెప్పారు.