హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్బండ్ వద్ద 125 అడుగుల ఎత్తైన డా. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆ పనులు పూర్తవుతున్నాయి. ప్రముఖ శిల్పి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత రాంసుతార అధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఢిల్లీలో తయారుచేస్తున్నారు. అంత భారీ విగ్రహాన్ని హైదరాబాద్కి తీసుకురావడం చాలా కష్టం కనుక దానిని కొన్ని విడి భాగాలుగా తయారుచేస్తున్నారు. ఆ ముక్కలను హైదరాబాద్కి తీసుకువచ్చి హుస్సేన్ సాగర్ ఒడ్డున సిద్దం చేస్తున్న 11 ఎకరాల పార్కులో ఒకదానిపై ఒకటి అమర్చి విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతారు. డా.అంబేడ్కర్ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన సిఎం కేసీఆర్ విగ్రహావిష్కరణ చేస్తారు.
ఆ పార్కులో పార్లమెంట్ నమూనాలో ఓ ఆడిటోరియం నిర్మించి దానిపైన డా.అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఆడిటోరియంలో ఆయన జీవితచరిత్రకి సంబందించి పుస్తకాలు, ఫోటో గ్యాలరీతో పాటు ఓ మినీ థియేటర్లో కూడా ఉంటుంది. పార్లమెంటులో, బయటా ఆయన చేసిన ప్రసంగాల వీడియోలు దానిలో ప్రదర్శింపబడతాయి.
మంత్రులు కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్ళి అక్కడ తయారవుతున్న డా.అంబేడ్కర్ విగ్రహాన్ని పరిశీలించారు.