ఆదివాసీలకు అతి పెద్ద పండుగైన నాగోబా జాతర ఈనెల 31న ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో జరుగబోతోంది. ఆనవాయితీ ప్రకారం కేస్లాపూర్ గ్రామానికి చెందిన 150 మంది మెస్రం వంశీయులు ఈనెల 12వ తేదీన కాలినడకన బయలుదేరి 300 కిమీ దూరంలో ఉన్న జన్నారం మండలంలోని హస్తినమడుగుకు 18వ తేదీన చేరుకొన్నారు. అక్కడ పవిత్ర గోదావరి జలాలను కలశాలలో సేకరించి వెంటనే తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ నెల 27న ఇంద్రవెల్లి మండలంలోని ఇంద్రాయి ఆలయానికి చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. అక్క్ది నుంచి కేస్లాపూర్ చేరుకొని అక్కడ నాగోబా ఆలయం సమీపంలోగల మర్రిచెట్టు కిండా ఆ పవిత్ర గంగా కలశాలను ఉంచి మూడు రోజులపాటు పూజలు చేస్తారు. జనవరి 31వ తేదీ అర్ధరాత్రి వాటితో నాగోబాకు అభిషేకం చేయడంతో నాగోబా జాతర మొదలవుతుంది. పదిరోజుల పాటు సాగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారు.