తెలంగాణలో కరోనా పరిస్థితులు, ఆక్సిజన్, వాక్సిన్, మందులు లభ్యత తదితర అంశాలపై సిఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయాలు తీసుకొన్ని అధికారులకు పలు సూచనలు చేశారు.
ఇకపై ఆక్సిజన్ కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడే పరిస్థితి ఉండొద్దని, ఆక్సిజన్ లేదని ఆసుపత్రులో రోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అసలే వద్దని సిఎం కేసీఆర్ అన్నారు. ఈ సమస్యకు శాస్విత పరిష్కారంగా రాష్ట్రంలో హైదరాబాద్తో సహా జిల్లా కేంద్రాలలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల వద్ద, , ఏరియా ఆసుపత్రుల వద్ద ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
హైదరాబాద్లో 100 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఓ సెంట్రల్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇదిగాక హైదరాబాద్లో ఆసుపత్రుల వద్ద 16 టన్నుల ఆక్సిజన్ ప్లాంట్స్ ఆరు, జిల్లా ఆసుపత్రుల వద్ద 8 టన్నుల ప్లాంట్స్ 15, ఏరియా ఆసుపత్రుల వద్ద 4 టన్నుల సామర్ధ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్స్ 27 ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడికైనా ఆక్సిజన్ తరలించేందుకు వీలుగా 20 టన్నుల సామర్ధ్యం కలిగిన 11 ఆక్సిజన్ ట్యాంకర్లను 10 రోజులలోగా కొనుగోలుచేయాలని ఆదేశించారు.
వీటన్నిటి కోసం తక్షణమే ఆక్సిజన్ ప్లాంట్ తయారీదారులతో మాట్లాడి వీలైనంత త్వరగా ప్రతీ ఆసుపత్రి వద్ద ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.