ప్రధాని మోడీ నేడు పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరంలో పర్యటించి, అక్కడ పనిచేస్తున్న వాయుసేన సిబ్బందితో మాట్లాడి, వారి ధైర్యసాహసాలను మెచ్చుకున్నారు. భారత్ శక్తి సామర్ధ్యాలను పాకిస్థాన్కి, ప్రపంచదేశాలకు చాటి చెప్పారని ప్రధాని మోడీ మెచ్చుకున్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడి ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసినందుకు ప్రధాని మోడీ వాయుసేన సిబ్బందికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకున్నారు.
ప్రధాని మోడీ సుమారు గంటన్నర సేపు వారితో గడిపారు. ఆదంపూర్ వైమానిక స్థావరంలో తిరుగుతూ ఎస్-400 గగనతల క్షిపణి వ్యవస్థ, యుద్ధ విమానాల పక్కన వాయుసేన సిబ్బందితో కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రధాని మోడీ అదంపూర్ వైమానిక స్థావరంలో పర్యటించడానికి చాలా బలమైన కారణమే ఉంది. దానిని, అక్కడ మోహరించి ఉన్న అత్యంత శక్తివంతమైన ఎస్-400 గగనతల క్షిపణి వ్యవస్థని ధ్వంసం చేశామని పాక్ పాలకులు గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఆదంపూర్ వైమానిక స్థావరంలో చెక్కు చెదరలేదని పాకిస్థాన్కి, ప్రపంచ దేశాలకు కూడా ప్రధాని మోడీ పర్యటనతో, ఫోటోలతో సహా నిరూపించి చూపారు.