ఫుల్ స్పీడుతో దూసుకుపోతున్న గులాబీ కారు

April 20, 2025


img

శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఓటమి, కేసీఆర్‌ తుంటి ఎముక విరిగి ఫామ్‌హౌస్‌కి పరిమితమవడం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫిరాయింపులతో ఢీలా పడిన బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎన్నటికైనా కొలుకుంటుందో లేదో అనే సందేహాలు వ్యక్తం అవుతుండేవి. 

కానీ ఎవరూ ఊహించని విదంగా ఉవ్వెత్తున ఎగసిన కెరటంలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా బిఆర్ఎస్ పార్టీ హడావుడే  కనిపిస్తోంది. ఈ నెల 27న హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తిలోజరుగబోతున్న పార్టీ రజతోత్సవ సభ కోసం ఎక్కడికక్కడ ముఖ్య నేతల సన్నాహక సమావేశాలు, సభ ఏర్పాట్లు, జనసమీకరణ, మీడియాలో వీటన్నిటి గురించి వస్తున్న వార్తలు, ఫోటోలు, సోషల్ మీడియాలో నాయకుల సందేశాలతో  బిఆర్ఎస్ పార్టీ శ్రేణులలో మళ్ళీ ఇంత కాలానికి నూతనోత్సాహం కనిపిస్తోంది.

మొదట ఈ సభకి 2-3 లక్షల మందితో నిర్వహించాలని భావించినప్పటికీ, రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా కాంగ్రెస్‌, బీజేపిలకు బలమైన సంకేతాలు పంపాలంటే కనీసం 8-10 లక్షల మందితో నిర్వహించడం అవసరమని బిఆర్ఎస్ పార్టీ భావించి అందుకు అనుగుణంగా జనసమీకరణ చేస్తోంది. 

ఈ సభ పేరుతో బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేస్తున్న హడావుడి చూస్తుంటే రాష్ట్రంలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేయబోతోందా? అనిపించక మానదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, బ్యానర్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో బిఆర్ఎస్ పార్టీ ప్రచారం చాలా జోరుగా సాగుతోంది. 

కేసీఆర్‌ మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్‌గా పాల్గొనాలని బిఆర్ఎస్ పార్టీ నేతలే కాదు.. సిఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్‌, బీజేపి నేతలు కూడా కోరుకుంటున్నారు. వారి ముచ్చటని ఈ సభతో కేసీఆర్‌ తీర్చేయబోతున్నారు.

ఈ సభలో కేసీఆర్‌ ఏం చెప్పబోతున్నారో.. వాటితో రాష్ట్ర రాజకీయాలలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో? అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా కొలుకోవడానికి ఈ సభ విజయవంతం కావడం చాలా ముఖ్యం. కనుక హరీష్ రావు, కేటీఆర్‌, కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్, జూనియర్ నేతలు, కార్యకర్తలు ప్రతీ ఒక్కరూ రేయింబవళ్ళు దీని కోసం శ్రమిస్తున్నారు. 


Related Post