తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ శనివారం పార్టీకి రాజినామా చేసి రాష్ట్రీయ లోక్దళ్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కపిలవాయిని తెలంగాణ పార్టీ ఇన్ఛార్జిగా నియామిస్తున్నట్లు జయంత్ చౌదరి ప్రకటించారు.
కపిలవాయి దిలీప్ కుమార్ మొదట బిఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. కానీ కేసీఆర్ ధోరణి నచ్చక పార్టీని వీడి ప్రొఫెసర్ కోదండరామ్ స్థాపించిన తెలంగాణ జనసమితిలో చేరారు. కానీ దానిలో ఇమడలేక బీజేపిలోకి దాని నుంచి రాష్ట్రీయ లోక్దళ్ పార్టీలోకి మారారు.
ఆ పార్టీ అధ్యక్షుడుగా పనిచేస్తున్నప్పుడు 2023 ఎన్నికలకు ముందు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇమడలేక మళ్ళీ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ గూటికి చేరుకున్నారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వదులుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉనికే లేని రాష్ట్రీయ లోక్దళ్ పార్టీలో చేరి కపిలవాయి దిలీప్ కుమార్ ఏమి సాధించగలరో?ఇన్నిసార్లు, ఇన్ని పార్టీలు మారిన కపిలవాయి దిలీప్ కుమార్ ఈ పార్టీలో ఎన్ని రోజులు ఉంటారో?