నల్గొండ జిల్లా నకిరేకల్ పదో తరగతి పరీక్షలలో తొలి రోజునే ప్రశ్నాపత్రం లీక్ అయిన కేసులో అందుకు కారణమని భావిస్తున్న విద్యార్ధినిని తదుపరి పరీక్షలు వ్రాయకుండా డిబార్ చేశారు. దాంతో ఆమె హైకోర్టులో పిటిషన్ వేసింది.
విద్యాశాఖ అధికారులు, పరీక్షా కేంద్రం నిర్వాహకులు, ఇన్విజిలేటర్ నిర్లక్ష్యం కారణంగా ప్రశ్నాపత్రం లీక్ అయితే, దానికి తనని బలిపశువుని చేశారని, దీని వలన తన చదువులు మద్యలో నిలిచిపోయి, జీవితం దెబ్బ తినే ప్రమాదం ఉంటుందని ఆమె తన పిటిషన్లో పేర్కొంది. కనుక మిగిలిన పరీక్షలు వ్రాసేందుకు తనను అనుమతించాలని, విద్యాశాఖని ఆదేశించాలని తన పిటిషన్లో కోరింది.
ఆ పిటిషన్లో విద్యాశాఖ కార్యదర్శి, ఎస్ఎస్సీ బోర్డ్ కార్యదర్శి, నల్గొండ డీఈవో, ఎంఈవో, నకిరేకల్ పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్లను ప్రతివాదులుగా పేర్కొంది. ఆమె పిటిషన్ని హైకోర్టు విచారణకు స్వీకరించి, ప్రతివాదులను ఏప్రిల్ 7లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఈ కేసులో ఆ బాలిక పేరుని, ప్రశ్నాపత్రం వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండు పోలీస్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు ఆ బాలిక స్వయంగా హైకోర్టులో పిటిషన్ వేయడంతో తనంతట తానే ఆమె తన పేరు, వివరాలు బయట పెట్టుకుంది. కనుక ఈ రెండు కేసుల పరిస్థితి ఏమవుతుందో చూడాలి.