ఎఫ్-1 రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ని ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ప్రశ్నించిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరుకావాలని చెప్పి పంపేశారు.
ఏసీబీ కార్యాలయం బయట కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, “ఇదో తప్పుడు పనికిరాని కేసని, రాజకీయ ఒత్తిడి కారణంగానే నమోదు చేశారని ఏసీబీ అధికారులకే నేను చెప్పాను. వారు అడిగిన ప్రశ్నలన్నీటికీ సమాధానాలు చెప్పాను.
మళ్ళీ ఎన్నిసార్లు రమనమ్మన్నా తప్పకుండా విచారణకు వస్తానని, సహకరిస్తానని చెప్పాను. పైసలు పంపానని నేనే చెపుతున్నాను. ఇక దీనిలో అవినీతి ఎక్కడుంది? అని నేనే వారిని ప్రశ్నించాను. ఎంత వచ్చాయని వారు అడుగుతున్నారు. నాలుగైదు ప్రశ్నలని తిప్పి తిప్పి అడిగారు తప్ప అవినీతి జరిగిందని నిరూపించేందుకు ఒక్క ప్రశ్న ఆడగలేకపోయారు,” అని చెప్పారు.
కేటీఆర్ మీడియాతో మాట్లాడుతుండగా డీసీపీ విజయ్ కుమార్ వచ్చి అభ్యంతరం చెప్పగా, “మీడియాతో మాట్లాడుతుంటే మీకెందుకు భయం?” అని ఎదురు ప్రశ్నించారు. భయం కాదు ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుందని చెప్పారు. మీ పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ప్రెస్మీట్ పెట్టుకోండి. ఇక్కడ కాదు..” అంటూ మీడియా ప్రతినిధులను అక్కడి నుంచి పంపించేశారు.