హర్యానా, జమ్మూ కశ్మీర్ శాసనసభ ఎన్నికలకు సంబందించి ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నప్పటికీ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పష్టత వచ్చేసింది. హర్యానా శాసనసభలో మొత్తం 90 సీట్లు ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకి 46 సీట్లు కావలసి ఉండగా బీజేపీకి ఆధిక్యం, గెలిచినవి కలిపి 47 స్థానాలు దక్కాయి. కనుక హర్యానాలో బీజేపీ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.
బిజెపీకి బొటాబొటి మెజార్టీ వచ్చినప్పటికీ నలుగురు స్వతంత్ర అభ్యర్ధులు, ఇద్దరు ఐఎన్ఎల్డీ ఎమ్మెల్యేలను, భవిష్యత్లో వీలైతే కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించుకొని బలపడగలదు.
హర్యానాలో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ అంచనావేయాగా కాంగ్రెస్ పార్టీకి 37 స్థానాలకు పరిమితమైంది. ఆమాద్మీ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.
జమ్మూ కశ్మీర్లో కూడా మొత్తం 90 సీట్లు ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకి కనీసం 46 సీట్లు అవసరం కాగా ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 43, దాని మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ 7 సీట్లు మొత్తం 50 సీట్లు గెలుచుకోబోతున్నాయి.
కనుక ఆ రెండు పార్టీలు కలిసి జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి. జమ్మూ కశ్మీర్లో ప్రధాన పార్టీలలో ఒకటైన పిడీపీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. బీజేపీ 28 సీట్లు, ఇతరులు 10 సీట్లు గెలుచుకోనున్నారు.
కనుక జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ కంటే బీజేపీ బలమే ఎక్కువగా ఉందిప్పుడు. భవిష్యత్లో పరిస్థితులు అనుకూలిస్తే బీజేపీ చక్రం తిప్పి అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు.
ఈరోజు మధ్యాహ్నం ఫలితాలపై స్పష్టత రాగానే ఉమర్ అబ్దుల్లా జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారని ఆయన తండ్రి ఫరూక్ అబ్ధుల్లా ప్రకటించారు.