ఒకప్పుడు క్రికెట్లో ఓ వెలుగు వెలిగి, ఆ తర్వాత రాజకీయాలలో కాస్త రాణించిన మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ మహమ్మద్ అజహారుద్దీన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండటం చాలా శోచనీయం. దశాబ్ధాలపాటు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు ఈ అవినీతి ఆరోపణలతో మసకబారుతున్నాయి.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహమ్మద్ అజహారుద్దీన్ నేడు హైదరాబాద్లో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా వ్యవహరించినప్పుడు ఆయన జనరేటర్స్, అగ్నిమాపక సామాగ్రి, వాహనాలు వగైరా కొనుగోలులో రూ.20 కోట్లు అవకతవకలు జరిగిన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులోనే ఈడీ ఆయనకు నోటీసు పంపించి నేడు ప్రశ్నిస్తోంది.
అయితే తాను ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని, తన శత్రువులు కొందరు లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని, అవన్నీ తప్పుడు ఆరోపణలని మహమ్మద్ అజహారుద్దీన్ అన్నారు. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్ధిక లావాదేవీలను, కొనుగోలు రసీదులను పరిశీలించకుండానే ఈడీ ఆయనకు నోటీసులు పంపించి విచారణకు రప్పించిందా? అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం లభిస్తుంది.