హర్యానా, జమ్ము కశ్మీర్ శాసనసభ ఎన్నికలు చూస్తూండగానే చకచకా జరిగిపోయాయి. నేడు వాటి ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగబోతోంది. ఓట్ల లెక్కింపుకి కేంద్ర ఎన్నికల కమీషన్ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
ప్రస్తుతం హర్యానాలో బీజేపీ అధికారంలో ఉంది. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. జమ్ము కశ్మీర్లో మాత్రం ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవచ్చని సూచిస్తున్నాయి.
ఒకవేళ హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే ఇది బీజేపీకి ముఖ్యంగా మోడీ ప్రభుత్వానికి దేశంలో వ్యతిరేకత పెరుగుతున్నట్లు సూచిస్తున్నట్లవుతుంది. కనుక ఈ ఎన్నికలలో గెలిచేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డి పోరాడింది.
హర్యానాలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పర్వాలేదు కానీ జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్, విపక్ష పార్టీలు అధికారం చేజిక్కించుకుంటే మళ్ళీ వేర్పాటువాదులు బలపడే అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటే అవి జమ్మూ కశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తిని పునరుద్దరించాలని పట్టుబడతాయి.
అలాగే జమ్మూ కశ్మీర్లో పీడీపీ, నేషనల్ ఫ్రంట్ రెండు పార్టీలు పాకిస్తాన్ అనుకూలవాద పార్టీలు. కనుక జమ్మూ కశ్మీర్లో ఎన్నికల ఫలితం యావత్ దేశంపై ఎంతో కొంత ప్రభావం చూపుతుంది.
ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటలోగా రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.